ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సిరా న్యూస్,తిరుపతి;
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 21 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
21-05-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం
22-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
23-05-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
24-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
25-05-2024
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం
26-05-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
27-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
28-05-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం, కల్యాణోత్సవం
29-05-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
===========================