సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎన్నికల పేరిట బీజేపీ నేతలు వసూళ్లు : కంది శ్రీనివాసరెడ్డి
* బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటాం
బీజేపీ విధానాలను, ఆదిలాబాద్ ఎమ్మెల్యే దురాగతాలను ప్రజలు చీదరించుకుంటున్నారని, చీ కొడుతున్నారని కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రచారం పేరిట, ఎన్నికల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్లో శనివారం ఏర్పాటు మీడియా సమావేశంలో బీజేపీ నేతల తీరుపై ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే భయపెట్టి పేదల భూములను కబ్జా చేస్తున్నారని, ఒకవేళ వినకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వ్యాపారులు, వైద్యుల నుంచి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకుంటున్నది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఈ దురాగతాలను ఎండగట్టడానికి త్వరలోనే ఒక హెల్ప్లైన్ నెంబర్ను ఏర్పాటు చేస్తామని, ఎవరైన తమ భూములను కబ్జా చేస్తే బాధితులు తమను సంప్రదించవచ్చని తెలిపారు. బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. బాధితుల పక్షాన న్యాయపరంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని అభయం ఇచ్చారు. ఈ చర్యలను ప్రజలు సహించరని, తగిన రీతిలో బుద్ధిచెబుతారని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆరాచకాలకు, అన్యాయాలకు తావులేదన్నారు. భూకబ్జాదారుల భరతం పడతామని హెచ్చరించారు. అటు రెండు రోజులు చాలా అప్రమత్తంగా ఉండి పోలింగ్ రోజున అత్యధిక మెజార్టీ సాధించే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిందని అన్నారు. 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ సరఫరా, 500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ బీమాను పది లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేర్చి సీఎం రేవంత్రెడ్డి సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చని అన్నారు. పంద్రాగస్టులోపు రైతు రుణమాపీ సైతం చేస్తామని ప్రకటించారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సీఎం తెగించి రైతుబంధు నిధులు సర్దారని అన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు శతవిధాలుగా కష్ట పడుతున్నారన్నారు. దుబార ఖర్చులను తగ్గిస్తున్నారన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి పోయినప్పటికీ సీఎం రేవంత్రెడ్డి తన రాజకీయ చాతుర్యంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ప్రజాపాలన అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారన్నారు. చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు 29 కోట్లు వడ్డీని కడుతున్నారన్నారు. అందుకే ప్రజలందరూ కాంగ్రెస్ను విశ్వసిస్తున్నారన్నారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ రోజున వందశాతం ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా ఓటర్లను కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, మావల ఎంపీపీ దర్శనాల సంగీత-ఏవన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, భోజారెడ్డి, గణపతిరెడ్డి, ఖయ్యూం, నాయకులు పసుల చంటి, తదితరులు పాల్గొన్నారు.