ఎడారిగా శ్రీరామ్ సాగర్

సిరా న్యూస్,నిజామాబాద్;
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని సుమారు 12 లక్షల ఎకరాలకు తాగు, సాగునీరు అందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8 టీఎంసీలు మాత్రమే నీరుంది. దీంతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి పడిపోయింది. వర్షాకాలం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా.. వరుణుడి కరుణ లేకపోవటంతో ఇప్పటివరకు కేవలం 1 టీఎంసీ నీరుమాత్రమే చేరింది. అటు ప్రాజెక్టు ఎగువన గల గోదావరి పరివాహ ప్రాంతంలో సైతం వర్షాలు లేకపోవడంతో గోదావరిలోకి ఇన్‌ఫ్లో లేకపోవటం, ఇటు ఖరీఫ్ సీజన్‌ మొదలు కావటంతో రైతన్నల్లో ఆందోళన మొదలైంది.ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్ట్‌ల పరిస్థితీ ఇదే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు జూలై 1న ఎత్తాలి. కానీ, ఆ ప్రాజెక్టు ఖాళీ కుండలా ఉండటంతో గేట్లు ఎత్తినా ప్రయోజనం లేదు. ఇక.. ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతంలోని విష్ణుపురి ప్రాజెక్ట్‌ నుంచే ప్రస్తుతం కొద్దికొద్దిగా నీరు చేరుతోంది.మరోవైపు.. ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తెచ్చేందుకు గత ప్రభుత్వం రూ. 1067 కోట్ల నిధులతో పునరుజ్జీవన పథకం పనులు ప్రారంభించి, గత జులైలో కాళేశ్వరం నుంచి 25 టీఎంసీల నీటిని తరలించారు. కానీ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిస్థితి గందరగోళంగా మారటంతో ఈ ఏడాది తమ ఖరీఫ్ పంట ఏమవతుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది. పదేళ్లలో 2016, 2018లో మాత్రమే సమయానికి వరదనీరు వచ్చి చేరింది. 2016లో జూలై నాటికే ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారగా, వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలాల్సి వచ్చింది. 2018లోనూ ముందస్తు వరదలు వచ్చినా తర్వాత వానలు లేక.. ప్రాజెక్టు నిండలేదు. 2023లో సకాలంలో వరద నీరు భారీగా రావటంతో జూలైలో ప్రాజెక్ట్‌ నిండింది. మిగిలిన సంవత్సరాల్లో ఎప్పుడూ ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనే వరదలు వచ్చి ప్రాజెక్టుకు వరదనీరు వచ్చింది. దీంతో ఆయా సంవత్సరాల్లో అధికారులు.. ఖరీఫ్‌కు నీటి విడుదల చేపట్టకుండా రబీ సీజన్ నాటికి కాస్త ముందుగా నీటిని విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితులు నేపథ్యంలో ఏ ఏడాదీ అదే పరిస్థితి వచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖ భావించగా, వరుణుడు దయ తలిస్తే వారంలోనే ఈ పరిస్థితి మారి, తమకు ఖరీఫ్ పంట కూడా దక్కుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 112 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో నిర్మించిన నాటి నుంచి పూడిక పేరుకుంటూ వచ్చింది. దీంతో ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 90 టీఎంసీలని చెబుతున్నప్పటికీ, నిజానికి అంతకంటే తక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *