Stalled cotton purchases : నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు

సిరా న్యూస్, అదిలాబాద్;
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు అర్థాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో నిరసనకు‌ దిగారు. సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లను నిరాకరించడంతో నిల్వ చేసిన పత్తి బేళ్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పత్తి అమ్మకాలు ప్రారంభించాలని లేదంటే రోడ్డెక్కుతామంటూ హెచ్చరించడంతో హుటాహుటిన వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు సమాచరం ఇచ్చారు. జిన్నింగ్ మిల్ యజమానులు, లారీ ఓనర్స్ మధ్య పత్తి బేళ్ల తరలింపు విషయం తలెత్తిన వివాదంతో సమస్య ఉత్పన్నమైందని గుర్తించిన అధికారులు.. జేసీ శ్యామాలదేవి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. టేడ్ యూనియన్ సభ్యులు, లారీ ఓనర్స్‌తో చర్చలు జరిపి రైతులకు నష్టం కలుగకుండా వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. దీంతో వ్యవసాయ కార్యాలయ సమావేశ మందిరంలో కాసేపు గందరగోళం ఏర్పడింది.పత్తి బేళ్ల తరలింపు కనీసం ధర ఇవ్వడం లేదని.. లారీ డ్రైవర్లు సైతం సమ్మెలో ఉన్నారని.. పత్తి రవాణా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని లారీ ఓనర్స్ అధ్యక్షుడు తేల్చి చెప్పడంతో జిన్నింగ్ మిల్స్ ట్రేడ్ యూనియన్ సభ్యులు గొడవకు దిగారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కలుగ చేసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇరు వర్గాలపై ఫైర్ అయ్యారు. రైతులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శ్యామలదేవి సైతం లారీ ఓనర్స్ వాదనను తోసి పుచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లారీ డ్రైవర్ల సమ్మె విరమించినా ఆదిలాబాద్ డ్రైవర్లు సమ్మెలో ఉన్నారని చెప్పడం ఏంటని ఫైర్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *