సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ ట్రై సిటీలో గురువారం చెత్త సేకరణ నిలిచిపోయింది. రోజూ తెల్లవారుజాము నుంచే చెత్త సేకరణ పనిలో నిమగ్నమయ్యే స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్లు బండ్లు పక్కన పెట్టి ఆందోళనకు దిగారు. దాదాపు నాలుగు నెలల నుంచి జీతాలు విడుదల చేయకపోవడంతో చెత్త సేకరణ నిలిపివేసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్ లు ఉండగా.. దాదాపు 2.25 లక్షల ఇండ్లున్నాయి. నిత్యం సుమారు 450 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటుంది. ఇలా వెలువడే చెత్తను సిటీ శివారులోని మడికొండ డంప్ యార్డుకు తరలించాల్సి ఉంది. ఈ మేరకు నగరంలో 169 స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేయగా.. వారంతా నిత్యం వీధుల్లో తిరుగుతూ చెత్తను సేకరించి, డంప్ యార్డుకు చేరవేస్తున్నారు.ఇంటింటా చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలిస్తున్న స్వచ్ఛ ఆటోల ఓనర్ కం డ్రైవర్లకు దాదాపు నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో పలుమార్లు సమస్యను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పెద్దగా పట్టించుకోలేదు. సంక్రాంతి పండుగ సమీపించడం, ఇంట్లో కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొంటూ స్వచ్ఛ ఆటో డ్రైవర్లు గురువారం ఆందోళనకు దిగారు. చెత్త సేకరణ ను పక్కన పెట్టి గ్రేటర్ అఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్నా ప్రభుత్వ అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త సేకరిస్తూ తరచూ రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. తెల్లవారుజామునే లేచి ఇంటింటా చెత్త సేకరిస్తే తమకు 15 వేల వేతనం ఇస్తున్నారని, అవి కూడా ఎటూ సరిపోవడం లేదన్నారు. ప్రతి నెలా వాహనాల రిపేర్లకే నాలుగు వేలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోయారు.నిత్యం చెత్త సేకరిస్తూ అనారోగ్యానికి గురవుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. స్వచ్ఛ ఆటోలు, ఓనర్ కం డ్రైవర్లను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసి, నెలకు రూ.24 వేల కనీస వేతనం అందించాలని కోరారు. ఇదే విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, తమ సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఆందోళనతో నగరంలో చెత్త సేకరణ ప్రక్రియ నిలిచిపోగా.. శానిటేషన్ సిబ్బంది చెత్తను తొలగించే పనులు చేపట్టారు. కాగా స్వచ్ఛ ఆటోడ్రైవర్ల ఆందోళన ఇలాగే కొనసాగితే నగరంలోని ఇండ్లలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయే ప్రమాదం ఉంది. మరి కార్మికుల సమస్యకు అధికారులు ఏవిధంగా పరిష్కారం చూపుతారో చూడాలి.