ఉందిగా జాగా…వేసేయ్ పాగా…

సిరా న్యూస్,వరంగల్;
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఓరుగ‌ల్లు భూముల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్పడింది. న‌గ‌రం చుట్టూ ప‌క్కల ఎక‌రం ధ‌ర ల‌క్షల్లో ఉంటే ఇప్పుడు రూ.కోట్లలోకి ఎగ‌బాకింది. న‌గ‌రం, న‌గ‌రం చుట్టు ప‌క్కల జ‌రుగుతున్న అభివృద్ధితో పాటు ప‌ట్టణ జ‌నాభా సైతం గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం భూముల రేట్లు పెర‌గ‌డానికి ప్రధాన కార‌ణంగా చెప్పవ‌చ్చు. అయితే భూముల విలువ పెరుగుద‌ల‌తో పాటు అంతే స్థాయిలో వివాదాలు, క‌బ్జాలు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అధికారం అండ‌దండ‌ల‌తో, రెవెన్యూ, న్యాయ వ్యవ‌స్థలోని లోప‌భూయిష్టమైన విధానాల‌ను ఆక‌లింపు చేసుకుంటున్న క‌బ్జా గ్యాంగులు భూ వివాదాల‌కు పాల్పడుతూ కోట్ల విలువ చేసే భూముల‌ను ఆక్రమించుకుంటున్నాయి. గ‌డిచిన ఐదేళ్లలో ఈ త‌ర‌హా దందాలు, కేసులు ఓరుగ‌ల్లులో వేల‌ల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. రెవెన్యూ అధికారులే స్వయంగా న‌కిలీ పత్రాల తయారీలో క‌బ్జా గ్యాంగుల‌కు స‌హ‌క‌రిస్తుండ‌డం విశేషం. కొంత‌మంది పోలీసులు క‌బ్జా గ్యాంగుల‌ భారీ ఆఫ‌ర్లకు స‌రెండ‌ర‌వుతున్నాయి. క‌బ్జాగ్యాంగులు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో తొలుత గుర్తిస్తాయి. స‌ద‌రు స్థలాల వైపు అస‌లు య‌జ‌మానులు ఏళ్లుగా రాక‌పోవ‌డాన్ని తెలుసుకుంటాయి. ఆ స్థలాల యజమానులు స్థానికంగా ఉండ‌డం లేద‌ని నిర్ధారించుకుంటాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరి వ్యక్తుల ద్వారా స‌ద‌రు స్థలం యాజ‌మాన్య హ‌క్కుల‌పై స‌ర్వం స‌మాచారం రాబ‌డ‌తారు. చాలా ఏళ్ల క్రిత‌మే స‌ద‌రు యజమాని ఆ భూమిని వేరే వ్యక్తులకు విక్రయించిన‌ట్లుగా, అతను దాన్ని మరికొందరికి అమ్ముకున్నట్లుగా, వారి నుంచి తాము కొనుగోలు చేసినట్లు ఫేక్‌ లింక్ డాక్యుమెంట్లు సృష్టిస్తారు. నిజమైన యజమాని వస్తే తమ దగ్గరున్న పత్రాలు చూపించి తమదే ఈ భూమని బెదిరింపుల‌కు దిగుతారు.కబ్జా చేయాల్సిన స్థలంపై ఫేక్ లింక్ మ‌రియు డాక్యుమెంట్స్‌ను సృష్టిస్తున్న క‌బ్జా గ్యాంగులు త‌మ భూమిని క‌బ్జా చేస్తున్నారంటూ అస‌లు య‌జ‌మానికంటే ముందే కోర్టుకెక్కి రాద్దాంతం మొద‌లుపెడ‌తారు. అంత‌కంటే ముందు స‌ద‌రు య‌జ‌మాని ఒకే ఆస్తిని ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు విక్రయించినట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు అదే స్థలాన్ని మ‌రికొంత‌మందికి విక్రయించిన‌ట్లుగా లింక్ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. వాస్తవానికి వీరంతా కబ్జా ముఠాల సభ్యులే అయి ఉంటున్నారు. తమ మధ్య ఆస్తికి సంబంధించిన వివాదం ఏర్పడిందని, వాటి పత్రాలు తమవద్ద ఉన్నాయని విన్నవిస్తూ వేర్వేరుగా న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. వాటన్నింటిని పరిశీలించి వాదనలు విన్న అనంతరం వారిలో ఎవరికో ఒకరికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పిస్తే, ఆ ప్రతులను పట్టుకుని తాము ఎంపిక చేసుకున్న జాగాలో పాగా వేస్తారు. వాస్తవంగా చూస్తే ఇక్కడ తప్పుడు పత్రాలు తయారు చేయడం, వాటిని ఆధారంగా చేసుకుని తమ మధ్య ఆస్తికి సంబంధించిన వివాదం ఏర్పడిందని, వాటి పత్రాలు తమవద్ద ఉన్నాయని చెబుతూ వారు వేర్వేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించ‌డం అనేది ప‌క్కా ప్రణాళిక‌తో జ‌రుగుతుంది. వాటన్నింటినీ పరిశీలించి, వాదనలు విన్న అనంతరం వారిలో ఎవరికో ఒకరికి అనుకూలంగా న్యాయస్థానం తీర్చిస్తే, ఆ ప్రతులను పట్టుకుని తాము ఎంపిక చేసుకున్న జాగాలో పాగా వేస్తారు.స్థలం య‌జ‌మాని త‌న‌కున్న భూమిలో కొంత భాగాన్ని ఆయ‌న బంధువుకు గిఫ్ట్‌ డీడ్ రాసిన‌ట్లుగా క‌బ్జాగ్యాంగులు న‌కిలీ ప‌త్రాలు సృష్టిస్తాయి. య‌జ‌మాని స‌మీప‌ బంధువు స‌ద‌రు స్థలాన్ని ఒక‌రికి విక్రయించ‌గా ఆయ‌న నుంచి వారి నుంచి తాము కొనుగోలు చేసిన‌ట్లుగా న‌కిలీ లింకు డాక్యుమెంట్లను సృష్టిస్తారు. అస‌లైన య‌జ‌మానుల‌కు, వారి వారసులెవ‌రైనా ఆ స్థలంలోకి వ‌చ్చి త‌మ‌దేన‌ని గ‌ట్టిగా నిల‌దీస్తే, ఆ ఆస్తిలో కొంత భాగ‌మే మీద‌ని, మిగ‌తాదంతా త‌మ‌దేన‌ని చెప్పి ద‌బాయిస్తారు. అందుకు ఆధారంగా తాము తయారు చేసిన లింకు డాక్యుమెంట్లను చూపెడుతున్నారు.స్థల య‌జ‌మాని నుంచి కొంత‌మంది భూమి కొనుగోలు చేసిన‌ట్లుగా నకిలీ పత్రాలు సృష్టిస్తారు. ఆ ఆస్తి ఇద్దరు లేదా ముగ్గురు చేతులు మారిన‌ట్లుగా లింకు డాక్యుమెంట్లను త‌యారు చేస్తారు. వారి నుంచి భూమి అభివృద్ధి కోసం తాము తీసుకున్నట్లుగా జీపీఏ ఒప్పందం కుదుర్చుకున్న ప‌త్రాల‌ను చూపెడ‌తారు. ఆ త‌ర్వాత స‌ద‌రు స్థలంలో కార్యక‌లాపాలు మొద‌లుపెట్టేస్తారు. యజ‌మాని గుర్తించే లోపే అక్కడ భ‌వ‌నాలు నిర్మించ‌డ‌మో, లేదా ప్లాట్లుగా విభ‌జించి విక్రయించ‌డ‌మో చేస్తారు. ఈ త‌ర‌హా దందాలో య‌జ‌మాని మోస‌పోవ‌డంతో పాటు, స‌ద‌రు స్థలంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా తీవ్రంగా న‌ష్టపోతున్నారు.ఆస్తిప‌త్రాలు పోయాయ‌ని, కొత్తవి మంజూరు చేయాల‌ని కోరుతూ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో క‌బ్జా చేయాల‌నుకుంటున్న స్థల వివ‌రాల‌తో ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. కొంద‌రు అధికారులు, సిబ్బంది స‌హ‌కారంతో కొత్త తేదీల‌తో రిజిస్ట్రేష‌న్ జ‌రిగిన‌ట్లుగా ఉన్న ప‌త్రాలను పొందుతారు. ఈ ప‌త్రాల ఆధారంగా కొన్నాళ్లపాటు ఖాళీ ఆస్తి ప‌న్ను, ఇత‌ర‌త్రా ప‌న్నులు చెల్లిస్తుంటారు. కొన్ని రోజుల త‌ర్వాత ఆ స్థలాన్ని ఆక్రమించేస్తారు. య‌జ‌మాని ఈ విష‌యం గుర్తించి స్థలం మీద‌కు వెళ్తే త‌మ పేరిట ఉన్న ప‌త్రాల‌ను చూపించి బెదిరింపుల‌కు పాల్పడుతారు. స్టాంప్ వెండ‌ర్స్ సాయంతో కూడా భూక‌బ్జాల‌కు పాల్పడుతుంటారు. స్టాంప్ వెండ‌ర్స్‌ రోజువారీ విక్రయాల రిజిస్ట్రర్‌లోని క్రమ‌సంఖ్యలో అక్కడ‌క్కడ ఖాళీలు వ‌దిలేలా చూస్తారు. కొంత‌కాలం త‌ర్వాత పాత తేదీల‌తో కూడిన ఆ స్టాంపు పేప‌ర్లను క‌బ్జా ముఠా స‌భ్యులు కొంటారు. వాటిని అడ్డం పెట్టుకుని న‌కిలీ ప‌త్రాలు సృష్టిస్తూ భూముల క‌బ్జాల‌కు పాల్పడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *