– పోర్టులో అక్రమాల నిరోధానికి చెక్ పోస్ట్లు
215 కోట్ల విలువైన 51వేల 427 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్
– కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి
సిరా న్యూస్,కాకినాడ;
పేదల ఆహార భద్రతకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం రిసైక్లింగ్ ద్వారా అక్రమ మార్గాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా, తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ వివేకానంద-పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రజా పంపిణీకి నిర్థేశించిన బియ్యం రిసైక్లింగ్, ఎగుమతులపై గత 15 రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులు, గొడౌన్లపై జరిపిన దాడులు, నిల్వల జప్తు, అక్రమ కార్యకలాపాల నిరోధానికి చేపడుతున్న కార్యాచరణ, వ్యవస్థలపై వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్ గురించి అందిన సమాచారాల ఆధారంగా గడచిన 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా 119 రైస్ మిల్లులు, 76 పెద్ద గొడౌన్లను జాయింట్ కలెక్టర్, పౌరసరఫరాల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామన్నారు. ప్రతీ మిల్లుకు సంబంధించిన బియ్యం నిల్వలు, సియంఆర్ డేటాలను తనిఖీ చేసి అనుమానిత అక్రమ నిల్వల శాంపిళ్లను సేకరించి లాబొరేటరీ పరీక్షలకు పంపామని తెలిపారు. మొత్తం 215 కోట్ల రూపాయల విలువైన 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసామని, ఇందులో 12,184 మెట్రిక్ టన్నుల బియ్యం లాబ్ పరీక్షలలో రిసైకిల్డ్ బియ్యంగా నిర్థారణ అయిందని, మరో 11 వేల టన్నుల బియ్యం నిల్వలకు సంబంధించి పరీక్షా నివేదికలు రావలసి ఉందన్నారు. నిల్వల తనిఖీతో బాటు, ప్రజాపంపిణీ బియ్యం పౌష్టికతను పెంచేందుకు కలుపుతున్న కెర్నెల్స్ వల్ల రిసైక్లింగ్ బియ్యాన్ని పరీక్షలలో సులువుగా గుర్తించవచ్చనని ఆయన పేర్కొన్నారు. నిర్థారణ జరిగిన అక్రమ బియ్యం నిల్వలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసామని హెచ్చరించారు.
పాలిష్ చేసిన పిడిఎస్ బియ్యం విదేశాలకు ఎగుమతి యాంకరేజి పోర్టు ద్వారానే జరుగుతున్నట్లు గుర్తించామని ఈ అక్రమ కార్యకలాపాల నిరోధానికి పోర్టు, కస్టమ్స్, పోలీస్, పౌరసరఫరాల తదితర వంటి 8 శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పోర్టుకు చేరుకునే ప్రధాన రహదారులు, పోర్టు లోపల పిడిఎస్ రిసైక్లింగ్ బియ్యాన్ని గుర్తించేందుకు తగు శిక్షణ కల్పించిన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. రేషన్ కార్డుదారులందరూ బియ్యాన్ని తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు చేపట్టిన చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి, తుని వంటి 13చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసామని తెలియజేసారు. ఈ కౌంటర్ల ద్వారా కందిపప్పును కేజీ 160 రూపాయలకు, స్టీమ్డ్ రైస్ 49 రూపాయలకు, రా రైస్ 48 రూపాయలకు విక్రయిస్తున్నామన్నారు. అలాగే పెరుగుతున్న కూరగాయల ధరల నియంత్రణకు డిమాండు, సరఫరా అంశాలను నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు గైకొంటున్నామని జేసీ తెలియజేశారు.
ఈ సమావేశంలో డిఎస్ఒ ఎంవీ ప్రసాద్, సివిల్ సప్లయ్స్ డీఎం ఎం బాల సరస్వతి, సమాచార శాఖ డిడి డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
========================