-సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టవద్దు
-యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
-మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బొల్లపల్లి రాజు
సిరా న్యూస్,మంథని;
గ్రామాలలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బొల్లపల్లి రాజు తెలిపారు.
శనివారం మంథని మండలంలోని ఏగ్లాస్ పూర్ గ్రామంలో మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు, మంథని ఎస్సై డేగల రమేష్, రామగిరి ఎస్సై చంద్ర కుమార్ ల ఆధ్వర్యంలో మంథని సర్కిల్ లోని పోలీస్ సిబ్బందితో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు .గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోన్నారు. అంతేకాకుండా సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు విధించారు. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ గ్రామంలోని యువత గంజాయి మరియు మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు. గంజాయి, మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని సూచించారు. గ్రామంలోని యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి గొడవలలో తలదూర్చకూడదని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. వివిధ గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినందున చదువుకున్న యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం మంథని ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని సూచించారు.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.