సిరా న్యూస్, ఆదిలాబాద్
సత్యశోధక వివాహానికి అతిథిగా హాజరుకండి
* ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి సుకుమార్ పేట్కులే ఆహ్వానం…
మహాత్మ జ్యోతిరావు ఫులే దంపతులు 1873 వ సంవత్సరంలో స్థాపించిన సత్యశోధక సమాజ నియమాలకు అనుగుణంగా తమ కూతురు సుహర్ష రాణి యొక్క వివాహము ఈనెల 25న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగనుందని దానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ‘సత్యశోధక వివాహ పత్రిక”ను అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే రాసిన ఐదు మంగళాష్టకాలతో పాటు పరమహంస సద్గురు పులాజి బాబా పై తాను రాసిన రెండు మంగళాష్టకాలు మొత్తం ఏడు మంగళాష్టకాలతో ఈ పెళ్లి నిర్వహించబడుతుందని ఇందులో అక్షింతలకు బదులు పూలను చల్లి వధూవరులను ఆశీర్వదించడం జరుగుతుందని తెలిపారు. బహుజన మహనీయుల చిత్రపటాలకు వధూవరులు పూజ చేసిన అనంతరం బ్రాహ్మణుల ప్రమేయం లేకుండానే సత్యశోధకు పద్ధతిలో వివాహ తంతు పూర్తవుతుందని తర్వాత వధూవరులచే మహనీయుల బాటలో నడుస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది అని తెలిపారు. మాలి కులస్తుల తో పాటు బహుజన కులాలన్నీ “సత్యశోధక వివాహాలను” జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఆయనతో పాటు మాలి మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురుణులే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ ఉమేష్ రావు డోలే ఉన్నారు.