సిరా న్యూస్, ఆదిలాబాద్
పంట పండించే ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలి
* మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే
సొంత భూమి ఉండి పంట పండించి దేశానికి అన్నం పెట్టే ప్రతి రైతుకు ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా అందాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదని, అలాంటిది రేషన్ కార్డు ప్రతిపాదికన కుటుంబాలను గుర్తించడం అనేది సరియైన పద్ధతి కాదని తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ జరగాలని అన్నారు. అలాగే పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది.సమీక్షల పేరట కాలయాపన చేయకుండా రైతుబంధును వెంటనే విడుదల చేసి సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు. అలాగే వివిధ బ్యాంకుల నుండి పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి దేశానికి అన్నం పెట్టే అన్నదాతను షరతులతో సతమతం చేయకుండా మనస్ఫూర్తిగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాకాకుండా అడ్డదిడ్డమైన గైడ్లైన్స్ విడుదల చేసి సగం మంది రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని అధికారం ఎవరికి శాశ్వతం కాదని, ఉన్నంతకాలం దాన్ని ఇచ్చిన మాట పై నిలబడి కాపాడుకోవాలని అన్నారు.