సిరా న్యూస్, ఆదిలాబాద్
మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలి
* మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
“బహుజన మహనీయుల ఆశయ సాధనే మా జీవిత లక్ష్యం” అని పూలే దంపతుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజాలను చైతన్యపరిచి మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాల నుండి బయటపడేలా చేస్తామని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్ సత్యశోధక్ రఘునాథ్ ఢోక్ పూణే, ప్రముఖ సాహితీవేత్త మధు బావల్కర్ లతో కలిసి మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు 1873 వ సంవత్సరంలో సత్యశోధక సమాజాన్ని స్థాపించారని ఆ సమాజ నియమాలకు అనుగుణంగానే సత్యశోధక వివాహాలు జరిపించడం ప్రారంభించారని, వారి స్ఫూర్తితోనే ఆదివారం తమ కూతురు సుహర్షా రాణి పెళ్లి చంద్రపూర్ రాజురకు చెందిన సామాజిక కార్యకర్త పుండలిక్ వాడై, కుమారుడు లలిత్ తో జరిపించామని వేదమంత్రాలు, వేద బ్రాహ్మణులు లేకుండా మహాత్మ జ్యోతిరావు పూలే రాసిన సత్యశోధక మంగళాష్టకాలతో అక్షింతలకు బదులు పూలు చెల్లి ఈ పెళ్లి తంతుని నిర్వహించామని వధూవరులచే మహనీయుల అడుగుజాడల్లో నడుస్తామని ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. ఇలాంటి వివాహాలను బహుజన కులాల్లో ఉన్న అందరూ పాటించి మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను కేవలం చెప్పడమే కాకుండా తమ ఇద్దరు పిల్లల వివాహాలు సత్యశోధక పద్ధతిలోనే జరిపించాలని సుకుమార్ పెట్కులె అన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర లోని దాదాపు పది జిల్లాల నుండి అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నుండి ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి బహుజన మహనీయుల అడుగుజాడల్లో నడవడానికి ముందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.