సిరా న్యూస్,రామగుండం;
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బి పవర్ హౌస్ స్థానంలో సూపర్ క్రిటికల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబుకు గోదావరిఖని లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి శాలువాలతో సన్మానించారు.అనంతరం మార్కండేయ కాలనీలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిందని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని రామగుండంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేదన్నారు. ప్రశ్నించే వారిపై అనేక కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని, ప్రాణాలు తీసేందుకు కూడా వెనకడలేదని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రజా హిత కార్యక్రమాలు చేపడుతుందని, అలాగే శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రామగుండం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం కొత్తగా పరిశ్రమలను తీసుకురావాలని, రామగుండం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రామగుండంలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబును ఎమ్మెల్యే ఠాగూర్ కోరారు.