చెరువును మింగేసిన ఇన్ ఫ్రా

సిరా న్యూస్,హైదరాబాద్;
సాక్షాత్తు నీటిపారుదల శాఖ అధికారులు చెరువు ఉందని తమ రిపోర్టులో స్పష్టం చేసిన గ్రేటర్ ఇన్ ఫ్రా అక్రమాలకు అడుగులొత్తుతూ ఉన్నతాధికారులు తప్పుడు రిపోర్ట్‌తో సంస్థను కాపాడే యత్నం చేశారు. ముడుపుల మాయలో పడ్డ అధికారుల అండతో కుంట పూర్తిగా మాయమైపోయింది. ప్రభుత్వం మారితే గత ప్రభుత్వ అక్రమాల గుట్టు బయటపడుతుందని ఆశించిన స్థానికులకు నిరాశే మిగిలింది. అధికారులు అండగా నిలబడడంతో అక్రమాల తంతు కొనసాగుతూనే ఉంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఒర్రకుంట అక్రమార్కుల చేతిలో చిక్కి మాయమైపోతుంది. ఒకప్పుడు నిండుకుండ లాంటి నీటితో కళకళలాడిన ఆ ప్రదేశంలో విల్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సాక్షాత్తు 2017లో జాయింట్ సర్వే చేపట్టి హెచ్ఎండీఏ అధికారిక సైట్‌లో ఒర్ర కుంటకు సంబంధించి లేక్ మ్యాప్, ఎఫ్‌టీఎల్, క్యాడాస్ట్రల్ మ్యాప్‌లను పొందుపరిచింది. ఎఫ్‌టీఎల్ మ్యాప్‌లోని లాంగ్ ట్యూడ్, లాటిట్యూడ్ పాయింట్లను పరిశీలిస్తే విల్లాల నిర్మాణ ప్రదేశంలో కుంట ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు బొల్లారం గ్రామస్తులతో పాటు ఇరిగేషన్ అధికారులు సర్వేలో అక్కడ కుంట ఉందని తేల్చి చెప్పారు. ఈ ఆధారాలు, రుజువులు గ్రేటర్ ఇన్ ఫ్రా రాజకీయ పలుకుబడి ముందు పని చెయ్యట్లేదని చెప్పుకోవచ్చు. ఈ అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండ లభించడంతో సులువుగా కుంటలో నిర్మాణాలను కొనసాగించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.గ్రేటర్ ఇన్ఫ్‌ఫ్రా విల్లాల నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కుంట ఉందని జాయింట్స్ సర్వే రిపోర్ట్ తేల్చి చెప్పింది. హెచ్ఎండీఎ వెబ్ సైట్‌లో సైతం పూర్తి మ్యాపులతో వివరాలను పొందుపరిచింది. పక్కాగా ఒర్ర కుంట కనుమరుగైందని స్పష్టంగా తెలుస్తోన్న రెవెన్యూ శాఖ గాని ఇరిగేషన్ శాఖ గాని సదరు నిర్మాణ సంస్థకు అనుమతులు జారీ చేసిన హెచ్ఎండీఏ కానీ గ్రేటర్ ఇన్ ప్రాజెక్టుపై తీసుకునే చర్యలు మాత్రం శూన్యమని చెప్పవచ్చు. రెవెన్యూ శాఖ సర్వేలో మాయ చేసి సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేయడం ఇరిగేషన్ ఎన్ఓసీ లేకుండానే నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు ఇవ్వడం క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టకుండానే అనుమతులు మంజూరు చేయడం వెనుక గ్రేటర్ ఇన్ఫ్ ఫ్రా మామూళ్ల మయాతో అధికారుల నోర్లు మూయించిందనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ ఇన్‌ఫ్రా నజరానాలతో ఫిదా అయిన అధికారులు సదరు అక్రమాలపై చర్యలు చేపట్టకుండా తాత్సారం చేయడంతోనే నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. సదరు నిర్మాణ సంస్థ గత ప్రభుత్వంలోని పెద్దలది కావడంతో అధికారుల సైతం సదరు నేతలు చెప్పినట్లు తలూపి ఆశ్రమంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.ఎన్జీటీ సీరియస్ అవ్వడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కదిలిన ఉన్నతాధికారులు గ్రేటర్ ఇన్ ఫ్రాకు పెద్ద ఎత్తున కొమ్ము కాశారనే ఆరోపణలు ఉన్నాయి. జాయింట్ రిపోర్ట్‌తో పాటు గ్రామస్తులు కుంట ఉందని తేల్చి చెబుతున్న రెవెన్యూలో ఉన్న లొసుగులను అనుకూలంగా మార్చుకుని గ్రేటర్ ఇన్ ఫ్రాకి ప్రత్యక్షంగా సహకరించేలా నివేదిక తయారు చేసినట్లు స్పష్టమవుతుంది. ఆ రిపోర్టులో పొందుపరిచిన అంశాలు సవాలక్ష అనుమానాలకు దారితీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *