సిరా న్యూస్, కళ్యాణదుర్గం:
కళ్యాణదుర్గం టీడీపీ లో కొత్త మలుపు
– ఓకే వేదికపై ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు
– ఒక్కటైన రెండు వర్గాలు
– కళ్యాణదుర్గం టీడీపీ లో కొత్త జోష్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గం టీడీపీ లో వర్గ పోరు కొత్త మలుపు తిరిగింది. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ భవనంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు ఓకే వేదిక పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడుతూ… గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల తాము విడి విడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము కానీ ప్రస్తుతం తాము కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించిన కూడా వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, అవినీతిపై ఎనలేని పోరాటం చేశామని అన్నారు. తాము రైతు కుటుంబాల నుంచి వచ్చామని, టీడీపీ పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్నామని అన్నారు. చంద్ర బాబు నాయకత్వం లో పని చేస్తూ, రాష్ట్రం లో టీడీపి పార్టీని అధికారం లోకి తేవడమే ద్యేయంగా పనిచేస్తామని అన్నారు. నియోజక వర్గంలో కొత్తగా ఒక వ్యాపారవేత్త హల్చల్ చేస్తున్నాడని, అధిష్ఠానం నుండి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనిదే, అంతా తానే అన్నట్లు వ్యవహరించడం సరికాదన్నారు. డబ్బుంటే సరిపోదని, కష్టకాలం లో టీడీపీ పార్టీ కి పనిచేసిన వారికే పార్టీ మద్దతు ఉటుందన్నారు. పార్టీ జెండా మోసి ఎన్నో అవాంతరాలను తట్టుకొని పార్టీ కోసం కష్ట పడ్డ తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరారు. పార్టీ కోసం పనిచేసిన ఏ కార్యకర్తకు టికెట్ ఇచ్చిన తమకు సమ్మతమేనని అన్నారు. కానీ కొత్తగా వచ్చిన వారికి మాత్రం టికెట్ ఇవ్వరాదని కోరారు. ఎప్పటికీ తాము టీడీపీ కుటుంబ సభ్యులమేనని, తమది విడదీయరాని అనుబంధం అన్నారు. కొన్ని అనివార్య కారణాల వలన విడిగా పార్టీ కోసం కష్ట పడ్డాము అని, ఇక మీదట కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. దీంతో నియోజకవర్గంలో రెండు వర్గాలు ఏకమయ్యాయి. పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది.