TDP to NDA : ఎన్డీయేలోకి టీడీపీ…

 సిరా న్యూస్,విజయవాడ;
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కసరత్తులు ప్రారంభించాయి. అయితే ప్రధానంగా ఏపీలో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే.. టీడీపీ, జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా.. వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. కొద్దిరోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. తర్వాత పవన్‌ కల్యాణ్‌ కూడా హస్తినకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలోనే.. భీమవ‌రంలో పర్యటించిన పవన్ కల్యాణ్ కార్యక‌ర్తల స‌మావేశంలో.. పొత్తులపై అంశంపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీతో క‌లిసి వ‌స్తున్నామ‌ని చెప్పారు.దీనికోసం తానెంత క‌ష్టప‌డ్డానని తెలిపారు. టీడీపీ-జ‌న‌సేన‌తో క‌లిసి వ‌చ్చేలా బీజేపీని పొత్తుల కోసం ఒప్పించేందుకు తానెంతో న‌లిగిపోయానని చెప్పారు పవన్. మరోవైపు.. పొత్తులపై పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్ కు భిన్నంగా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఎన్డీయేలో చేరాలని ఆహ్వానం అందిందన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని చెప్పారు. ఇప్పటికే జనసేనపార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. మొన్న అమిత్‌షాతో బాబు భేటీ తర్వాత టీడీపీ కూడా ఎన్డీఏలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్డీఏలో రెండు సార్లు చంద్రబాబు చేరారు.వాజ్‌పేయి గవర్నమెంట్ సమయంలో అంటే 2004 వరకూ ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు తర్వాత బయటకు వచ్చారు. తర్వాత 2014ఎన్నికలకు ముందు ఏన్డీఏతో జతకట్టి.. 2017 వరకూ కూటమిలో ఉన్నారు. ఇక ఏన్డీఏలో భాగంగా టీడీపీ ఎంపీలు సైతం కేంద్ర మంత్రి పదవులు పొందారు. ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో కేంద్రమంత్రి పదవులకు పార్టీ నేతలు రాజీనామా చేసి బీజేపీపైనే ఫైట్ చేశారు. మరోసారి టీడీపీ ఎన్డీఏలో చేరితే ఇది మూడోసారి కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *