విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి
పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పాఠశాల ఆవరణలో వ్యర్ధాలు, పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్ర చేయాలి
డిజిటల్ బోధన తరగతులు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలు అందించాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాలల ఆవరణలో చింత, ఉసిరి, వెలగ, కరివేపాకు, మునగ వంటి మొక్కలు నాటించాలన్నారు. 9వ తరగతి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పేర్కొన్నారు. 9వ తరగతి విద్యార్థి యూనిఫామ్ ధరించకపోవడంతో యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదని కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు తన పుట్టినరోజని శివాజీ అనే విద్యార్థి తెలుపగా విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ టివిని పరిశీలించారు. డిజిటల్ టివి ద్వారా విద్యార్థులు పాఠాలు వినేందుకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని 10 పాఠశాలలో
హెచ్ డి ఎఫ్ సి సి ఎస్ ఆర్ నిధులతో 10 టివిలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి ద్వారా విద్యాబోధన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన, నాణ్యమైన విద్యా బోధన చేయాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో మరమ్మతు పనులను అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభించి మూడు నెలలైనా ఎందుకు పూర్తి చేయలేకపోయారని, తక్షణమే పూర్తి చేయువిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని, ఈ వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందించాలని ఆయన సూచించారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంన్నాయని, మున్సిపల్ చట్టం ప్రకారం పరిశుభ్ర చేపించు బాధ్యత మున్సిపాలిటీదేనని, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి ఆవరణలో వ్యర్ధాలను, పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్ర చేయాలని కమిషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.