సిరా న్యూస్, భీమదేవరపల్లి
వంద రోజుల్లోఎస్సి వర్గీకరణ ఎటుపోయే…
* తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు
బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోఎస్సి వర్గీకరణ చేస్తామని చెప్పిందని, ఇప్పటి వరకు ఎస్సి వర్గీకరణ చేయలేదని ముల్కనూర్ టౌన్ తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. శనివారం ముల్కనూర్ టౌన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.భారతదేశంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వం ఏర్పడే ముందు ఒకమాట..ఏర్పడిన తరువాత మరోమాట… మూడు దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణమాదిగ పోరాటం చేస్తుంటే.. మాదిగల ఓట్ల కోసం 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు వర్గీకరణ చేయకపోవడం వెనక ఆంతర్యమేంటో ఈ దేశ మాదిగ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉందన్నారు.30 సంవత్సరాలు మాదిగ జాతి కోసం సుదీర్ఘమైన పోరాటాలు జరుగుతుంటే, ఎమ్మార్పీఎస్ ఉద్యమాలు చేస్తున్న సమయంలో ఈ దేశ మాదిగల ఓట్ల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ వర్గీకరణ అంశం ఎత్తుకున్నట్లుగా కనబడుతుందని ఆరోపించారు. హైదరాబాదులో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధానమంత్రి మోడీ హాజరై లక్షలాదిమంది మాదిగల ముందు వర్గీకరణ అంశంపై మాట ఇచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇంకా వర్గీకరణ జరగకపోవడం పట్ల మాదిగ జాతి ఆగ్రహానికి గురి అవుతున్నారని తెలిపారు. సమావేశంలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.