ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ
జాతీయ రహదారులు, వైద్యారోగ్య, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి
లోక్సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు
సమాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్యమంత్రి
సిరా న్యూస్,ఢిల్లీ;
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుంబిగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో నలుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడంతో పాటు తెలంగాణ నుంచి ఎంపీకైన లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్కు వైరి పక్షమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలుస్తున్నారు. హైదరాబాద్లో రక్షణ భూముల బదలాయింపు, రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఇళ్ల నిర్మాణం, నగరాల్లోని పెండింగ్ పనుల పూర్తి, వైద్యారోగ్య శాఖ బకాయిల మంజూరు విషయమై కేంద్ర మంత్రులతో సమావేశమై వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఇతర నగరాలైన వరంగల్, కరీంనగర్ సమస్యలపైనా కేంద్ర మంత్రి ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో చేపట్టిన పనులు పూర్తికాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ పనులు పూర్తయ్యే వరకు స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని మరో ఏడాది పాటు పొడిగించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు
===================