సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచార వాహనానికి దారి విషయంలో గొడవ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రమేష్ కు గాయాలయ్యాయి.
కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని 12వవార్డులో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు కూడా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతకు చెందిన ప్రచార రథం టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వార్డులోకి రావడంతో గొడవ మొదలైంది. ప్రచారంలో ఇరువురు నేతలు ఒకరికి ఒకరు ఎదురు కావడంతో మాటల యుద్ధం నెలకొంది. మాటా మాటా పెరిగడంతో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం అనంతపురంకు తరలించారు. ఇరు వర్గాల గొడవ తారాస్థాయికి చేరడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు.
=====================