సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆర్మీలో రిటైర్మెంట్… సంవత్సరానికే కానిస్టేబుల్ గా మరో ఉద్యోగం…
ఒక్క ప్రభుత్వ ఉద్యోగమే సాధించడం గగనమైన ఈ కాలంలో, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి రిటైర్మెంట్ తర్వాత సైతం మరో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి, పట్టుదల, మరెంతో తెలివి తేటలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లేఖర్ వాడ గ్రామానికి చెందిన తల్లెల మహేందర్ 2005 లో ప్రయత్నంలోనే ఆర్మీలో జవాన్ గా ఉద్యోగం సంపాదించాడు. అనంతరం 17 సంవత్సరాల పాటు వివిధ హోదాలో భారత దేశంలోనే కాకుండా, యుఎన్ఓ సైన్యం తరఫున లేబనాన్ దేశంలో సైతం సేవలందించాడు. కాగా 2023 లో ఆర్మీ జవాన్ గా రిటైర్మెంట్ అయిన తర్వాత, ఖాళీగా ఇంటి వద్ద ఉండకుండా బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకొని కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈమేరకు నియామక పత్రం అందుకున్నాడు. కాగా రెండోసారి ఉద్యోగం సాధించిన తల్లెల మహేందర్ ను గ్రామస్తులు, బంధువులు అభినందించారు. నేటి యువతకు మహేందర్ ఆదర్శమని అన్నారు.