సిరా న్యూస్,న్యూఢిల్లీ;
తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఉపాధిహామీ పనిదినాలు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది.
ఇందుకు గల కారణాలు తెలుపుతూ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. త్వరలో కేంద్ర బృందాలను తనిఖీకి పంపించాలని నిర్ణయించింది. ఏప్రిల్లో ఉపాధిహామీ పనులు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. ఆ నెలతో పాటు మే, జూన్లలోనూ భారీగా పనిదినాలు నమోదయ్యాయి. ఏప్రిల్లో 19,89,740 మంది కూలీలకు 4,27,09,616 పనిదినాలు; మేలో 22,08,256 మందికి 4,29,91,467; జూన్లో ఈ నెల 20 వరకు, 10,86,155 మందికి 85,60,952 పనిదినాలు కల్పించినట్లు నమోదైంది. ఉపాధిహామీ కూలీలు, పనిదినాలు రోజువారీగా నమోదవుతాయి. వాటి ఆధారంగా కేంద్రం చెల్లింపులు చేస్తుంది. ఈ మేరకు ఈ నెల 20 వరకు నమోదైన పనిదినాల సంఖ్య పెరుగుదల అసాధారణంగా ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో గణాంకాల నమోదు, ఎక్కువ మొత్తంలో కూలీలకు చెల్లింపులపై కేంద్రం ఆరా తీసింది. 2004 నుంచి ఇంతవరకు జరిగిన పనులను పరిశీలించింది. గత ఏడాది కంటే, జిల్లాల వారీగా, వరంగల్లో 232 శాతం, ములుగులో 231, కామారెడ్డిలో 229, ఖమ్మంలో 218, కరీంనగర్లో 217, సిద్దిపేటలో 200, పెద్దపల్లిలో 191, జోగులాంబ గద్వాలలో 187, రాజన్న సిరిసిల్లలో 181, మంచిర్యాలలో 180, హనుమకొండలో 178, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్లలో 169, జగిత్యాలలో 168, భద్రాద్రి కొత్తగూడెంలో 156, జనగామలో 155, మహబూబాబాద్, నిజామాబాద్లలో 151 శాతం చొప్పున పనిదినాలు పెరిగినట్లు నమోదైంది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి తాజాగా లేఖ రాసింది. కేంద్రం ఉపాధిహామీ కూలీల వేతనాలను పెంచిన నేపథ్యంలో తెలంగాణలో మునుపెన్నడూ లేనిరీతిలో పనిదినాలు నమోదయ్యాయని, గతంతో పోలిస్తే 18 జిల్లాల్లో పెరుగుదల శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని, ఇలా పనిదినాలు పెరగడానికి నిర్దిష్ట కారణాలను వెల్లడిస్తూ సమగ్ర నివేదికను కేంద్రానికి అత్యవసరంగా పంపించాలని ఎన్ఆర్ ఈజీఎస్ ఉప కార్యదర్శి ఆశీశ్ గుప్తా లేఖ రాశారు. దీంతోపాటు గత నెల 24న ఉపాధిహామీ పనుల తీరుపై తాము జారీచేసిన ఉత్తర్వులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని సూచించారు. ఈ మొత్తం అంశాలకు సంబంధించి నివేదిక అందిన తర్వాత కేంద్ర బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.
కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు..
కేంద్రం లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆ 18 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసింది. ఆయా జిల్లాల్లో పనిదినాలు పెరగడానికి నిర్దిష్ట కారణాలు తెలియజేయాలని సూచించింది. కేంద్ర బృందాలు వచ్చేనెల మొదటి వారంలో తనిఖీలకు వస్తున్నందున సంబంధిత రికార్డులను భద్రపరుచుకోవాలని ఆదేశించింది. ఆయా పనులకు సంబంధించి గ్రామసభల తీర్మానం, పనుల నిర్వహణకు నిరభ్యంతర పత్రం, పనులకు బోర్డులు, అంచనా వ్యయాలు, ఎంతమందికి పని కల్పించింది. పనిదినాలెన్ని. తదితర వివరాలతో పాటు పని ప్రారంభించడానికి ముందు, ముగిసిన తర్వాత తీసిన ఫొటోలను పంపించాలని ఆదేశించింది..
====================