సిరా న్యూస్,శ్రీశైలం;
లోకకల్యాణం కోసం శ్రావణమాసమంతా అఖండ శివనామ భజనలు
ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 4వ తేదీ ఉదయం వరకు నిర్వహించబడే శ్రావణమాసోత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని దర్శిస్తారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు పేర్కొన్నారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర మరియు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రావణ మాసంలో క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉందన్నారు.శ్రావణమాసోత్సవాలలో భక్తులకు కల్పించనున్న సౌకర్యాలను ఆదివారం రోజు కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.
ఈ సమీక్షలో ప్రధానార్చకులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.ఇప్పటికే ఈ మాసోత్సవాలకు సంబంధించి ఈ నెల 8వ తేదీన ప్రాథమిక సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో మాసోత్సవాల నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.కాగా ఈ రోజు జరిగిన సమీక్షలో మాసోత్సవాల నిర్వహణకు సంబంధించి చేపట్టిన చర్యలను ఆయా విభాగాల వారిగా కార్యనిర్వహణాధికారి వారు సమీక్షించారు. ఇంకనూ చేపట్టవలసిన చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.ముఖ్యంగా అధికారులందరు కూడా భక్తులకు వసతి, సౌకర్యవంతమైనదర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.అధికారులు, సిబ్బంది అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు. క్షేత్రానికి విచ్చేసే ప్రతీ భక్తుడిని కూడా అతిథిగా భావించాలన్నారు. ఈ విషయమై స్వచ్ఛందసేవలు నిర్వహిస్తున్న శివసేవకులలో కూడా తగిన అవగాహన కల్పించాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు.అన్ని విభాగాల అధికారులు కూడా మాసోత్సవాల ప్రారంభంలోగానే ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవాలన్నారు.క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు వసతి కల్పన పట్ల ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వసతి విభాగాన్ని ఆదేశించారు. శ్రావణమాసంలో భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తున్న కారణంగా అందుబాటులో ఉండే డార్మిటరీ వసతిపట్ల భక్తులకు అవగాహన. కల్పించాలన్నారు. డార్మిటరీ వసతికి సంబంధించి మరిన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.శ్రావణమాసంలో అధికసంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెబుతూ పాతాళగంగలో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్దేశించిన స్నానఘట్టాలలో మాత్రమే భక్తులు నదీస్నానాలు ఆచరించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.ప్రస్తుతం వరదనీటి ప్రవాహం వలన నదీలోతు పెరుగుతోందని చెబుతూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా భక్తులలో అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయమై పాతాళగంగ స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన కంచెను దాటి వెళ్ళకుండా కంచెకు ఇటువైపునే భక్తులు స్నానాలాచరించే విధంగా చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని మరియు నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయమై పాతాళగంగలో సూచికబోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.పాతాళగంగలో పారిశుద్ధ్యనిర్వహణ పట్ల మరియు శౌచాలయాల నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.తరువాత దర్శనం ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్నవిధంగానే ప్రతీరోజు కూడా వేకువజామున గం. 3.00లకే ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాలపూజలను జరిపించాలని ప్రధానార్చకులకు మరియు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారిని ఆదేశించారు. ఉభయదేవాలయాలలో మంగళహారతుల ప్రారంభం నుంచే అనగా వేకువజామున గం.4,30ల నుంచే భక్తులకు దర్శనాలు అనుమతించాలన్నారు. సాయంత్రం గం. 4,00లకు వరకు కూడా దర్శనాలు కొనసాగించాలన్నారు. తిరిగి సాయంకాలం ఆలయశుద్ధి తదితర కార్యక్రమాల అనంతరం గం. 5.30ల నుంచి రాత్రి గం.11.00ల వరకు కూడా దర్శనాలను కొనసాగిస్తుండాలన్నారు.శ్రావణమాసోత్సవాలలో భక్తులరద్దీకనుగుణంగా అన్నప్రసాదవితరణ ఉండాలని అన్నప్రసాద వితరణ విభాగాన్ని ఆదేశించారు. ఉదయం గం. 11.00ల నుంచే అన్నప్రసాదవితరణను ప్రారంభించాలన్నారు. అదేవిధంగా సాయంత్రం అల్పాహారాన్ని అందజేయాలన్నారు.క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యం నిర్వహణపట్ల తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రపరిధిలో అన్నిచోట్ల ముఖ్యంగా ప్రధానరహదారులు, పార్కింగు ప్రదేశాలు మొదలైనచోట్ల చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం మంచినీరు, అల్పాహారమును నిరంతరం అందజేస్తుండాలన్నారు.అవాంఛనీయసంఘటనలు జరగకుండా వుండేందుకు క్యూకాంప్లెక్సు, క్యూలైన్లు, ఆలయ ప్రాంగణం, దేవస్థానం వసతి భవనాలు మొదలైన అన్నిచోట్ల కూడా ఎలక్ట్రికల్ వైరింగు సరిగ్గా ఉండేవిధంగా తగు పర్యవేక్షణ చేస్తుండాలని ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు. అవసరమైనచోట్ల ఎలక్ట్రికల్ వైరింగునకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.ఎప్పటిలాగానే శ్రావణమాసమంతా కూడా అఖండ శివనామభజనలు ఆనవాయితీ అనుసరించి నిర్వహించాలని ఆలయవిభాగాన్ని ఆదేశించారు.ధర్మప్రచారంలో భాగంగా శ్రావణమాసంలోని రెండవ మరియు నాల్గవ శుక్రవారాలలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను జరిపించాలన్నారు. ఈ వరలక్ష్మీ వ్రతాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనేలా తగు ప్రచారాన్ని కల్పించాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమైన స్థానిక పోలీసుశాఖ సహకారాన్ని పొందాలని సూచించారు.నిత్యకళారాధనలో భాగంగా శ్రావణమాసంలో ప్రత్యేకంగా ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. భక్తి సాహిత్య కార్యక్రమములో భాగంగా ప్రముఖ కవి పండితులచేత అవధాన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అదేవిధంగా శ్రావణమాసంలో ప్రఖ్యాత ప్రవచకులచేత ఆధ్యాత్మిక ప్రవచనాలను ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల విభాగాన్ని ఆదేశించారు.