సిరా న్యూస్,శ్రీశైలం;
మహాశివరాత్రి ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శనివారం రోజు కార్యనిర్వహణాధికారి కైలాసద్వారాన్ని సందర్శించారు.
ఈ ఉదయం కైలాసద్వారం, భీమునికొలను మెట్ల ప్రారంభ ప్రదేశం మొదలైన ప్రాంతాలను పర్యటించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
భీమునికొలను మెట్లమార్గం వద్ద పాదయాత్రతో వస్తున్న పలువురు భక్తులతో కార్యనిర్వహణాధికారివారు ముఖాముఖిగా సంభాషించి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
నంద్యాల మరియు కర్నూలు జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కార్యనిర్వహణాధికారివారు సంభాషించడం జరిగింది. కాలిబాట మార్గములో మంచినీటి వసతి, ఆయా ప్రదేశాలలో శౌచాలయాల ఏర్పాటు, భక్తులు కల్పిస్తున్న అన్నదానం మొదలైనవాటి గురించి కార్యనిర్వహణాధికారి భక్తులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భక్తులందరు కూడా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా కైలాస ద్వారం వద్ద దేవస్థానం విశాలమైన చలువపందిర్లను (తాత్కాలిక షెడ్డు) వేయడంతో పాటు మంచినీటి వసతి, తాత్కాలిక విద్యుద్ధీకరణ మొదలైన వాటిని ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా కైలాసద్వారం వద్ద దేవస్థానం అన్నప్రసాదాలను కూడా అందజేస్తోంది.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ కైలాసద్వారం వద్ద భీమునికొలను మెట్ల మార్గంలో నిరంతరం మంచినీటి సరఫరా జరుగుతుండాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు.
ముఖ్యంగా కైలాసద్వారం వద్ద గల 20వేల లీటర్ల సామర్థ్యపు శాశ్వత మంచినీటిట్యాంకు (ఆర్.సి.సి ట్యాంకునకు నిరంతరం మంచినీటిని సరఫరా జరుగుతుండాలన్నారు.
అదేవిధంగా కైలాసద్వారం వద్ద గతంలో వలెనే 5వేల లీటర్ల సామర్థ్యం గల మరో 8 సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయబడ్డాయి.
ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను మార్గములో 1000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను 7 చోట్ల ఏర్పాటు చేయబడ్డాయి.అదేవిధంగా కైలాసద్వారం మరియు పరిసరాలను, భీమునికొలను మెట్ల ప్రారంభ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
ఈ పరిశీలనలో అసిస్టెంట్ ఇంజనీర్లు రాజేశ్వరరావు, సీతారమేష్, రంగప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.