వలసల పర్వం…అటు నుంచి ఇటు

సిరా న్యూస్, విజయవాడ;
శీతాకాలంలో కూడా ఏపీ రాజకీయాలు రోహిణి కార్తె వేడిని తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఈ హీట్ ఎడారి వాతావరణాన్ని సృష్టిస్తోంది. వడదెబ్బ తగిలినట్లుగా పార్టీ నీరసించిపోతోంది. నిర్వీర్యమైపోతోంది. ఇందుకు కారణం వైసీపీ అధినేత, సీఎం జగన్ తీసుకొనే నిర్ణయాలు. జగన్ తీరు, వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలతో వైసీపీ వరుస షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల మార్పుతో ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొనగా ఒక్కొక్కరుజగన్ మోహన్ రెడ్డికి బై బై చెప్పేస్తున్నారు. టటా వీడుకోలు ఇక సెలవూ అంటూ పార్టీని వీడుతున్నారు. వారిని ఆపడానికి జగన్ నియమించుకున్న బృందం ఎంత ప్రయత్నించినా, స్వయంగా జగన్ వారికి హామీలు గుప్పించినా ఫలితం ఉండటం లేదు. వైసీపీలో నేతల రాజీనామాల పర్వానికి ఫుల్ స్టాప్ పడడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో మొదలైన ఈ నేతల రాజీనామాల పరంపర అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం (జనవరి 10) కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇక రేపో మాపో ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి కూడా వైసీపీని వీడడం ఖాయమైంది. సంక్రాంతి లోపే పార్థసారథి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. వీరు చాలరన్నట్లు ఉరుములేని పిడుగులా.. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. రక్షణ నిధి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ తో చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీని వీడే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. రక్షణనిధి కూడా సంక్రాంతి పండగ లోపే పార్టీకి, పదవికి రాజీనామా చేయడం గ్యారంటీగా చెప్తున్నారు.సొంతపార్టీ నేతల రాజీనామాలు వైసీపీని చిక్కుల్లోకి నెడుతున్నాయి. ముందుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. అదే దారిలో అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా పసుపుకండువా కప్పుకున్నారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇప్పుడు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇలా పార్టీని వీడే వారి జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, బి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్, దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ లు కూడా అదే దారిలో నడిచేందుకు రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరందరికీ కూడా జగన్ నియోజకవర్గం మార్చడమో, లేదా ఈ సారికి పార్టీ టికెట్ లేదనో చెప్పడమే వీరి ఆగ్రహానికి, అసంతృప్తికీ కారణమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ కారణంగానే ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వీరు.. నేడో రేపో పార్టీకి రాజీనామా చేసేసినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడి అవకాశం ఉందని చెబుతున్నారు.జగన్ ఏకస్వామ్య, ఏకపక్ష నిర్ణయాల కారణంగానే పార్టీలో వలసల జోరు పెరిగిందని పార్టీ నేతలే చెబుతున్నారు. అంతా నా ఇష్టం.. అంతా నా ఇష్టం.. ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అన్నట్లుగా పార్టీలో నన్నడిగేవాడెవరు అన్న తలబిరుసుతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయననే కాకుండా పార్టీని కూడా ముంచేస్తున్నాయని పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి మొండి వైఖరి కారణంగానే రాజకీయంగా వైసీపీ పతనం దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్న అభిప్రాయం పరిశీలకుల నుంచే కాకుండా పార్టీ వర్గాల నుంచి కూడా వ్యక్తం అవుతోంది. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్నాను కనుక ప్రజలు తనకే ఓటేస్తారని, తానెవరిని చూపిస్తే వాళ్లనే గెలిపిస్తారన్న భ్రమలో జగన్.. సర్వేల పేరిట అభ్యర్థులను మార్చేస్తే గెలిచేస్తాననీ, మళ్లీ అధికారం చేపడతాననీ కలలు కంటున్నారు. అయితే ఇది జరిగే పని కాదని, ఈసారి ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారనీ పార్టీ నేతలే అంటున్నారు. జగన్ తీరు మార్చుకోవాలని అనేక సందర్భాల్లో ఆయనకు చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదని అంటున్నారు. అందుకే మా దారి మేం చూసుకుంటున్నామంటూ జగన్ పార్టీకి, జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *