సిరా న్యూస్, విజయవాడ;
24 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వైసీపీ హిట్ లిస్ట్ ఇప్పుడు ఉమ్మడి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పుట్టిస్తోంది. 2019 ఎన్నికల్లో కుప్పం మినహా జిల్లా అంతటా వైసీపీ జెండాను ఎగరవేసిన అధికార పార్టీ, ఇప్పుడు వై నాట్ 175 అంటోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సర్వేలు, సామాజిక సమీకరణలు, బలాబలాలు పరిగణలోకి తీసుకుంటోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ హై కమాండ్ నాలుగో లిస్ట్ పై కసరత్తు ప్రారంభించింది.వైసీపీ మూడో విడత జాబితా విడుదలతో కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం తెలిపోగా, మిగతా స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ కొనసాగుతోంది. తిరుపతి పార్లమెంట్ తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు మదనపల్లి చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు రిజర్వర్డ్ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించిన వైసీపీ అధిష్టానం సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి పార్లమెంట్ ఇన్చార్జిగా ప్రకటించింది. ఇక చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ను తప్పించి విజయానంద రెడ్డికి, మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషను తప్పించి నిషార్ అహ్మద్ కు, పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబును తప్పించి డాక్టర్ సునీల్ కుమార్ ను వైసీపీ అధిష్టానం సమన్వయకర్తలుగా చేసిందిఇక మిగతా నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వని వైసీపీ అధిష్టానం సిట్టింగుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల్లో వైసీపీ నెక్స్ట్ జాబితా కలవర పెట్టిస్తోంది. పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి, ఇక ఇప్పటికే ప్రకటించిన కుప్పం స్థానాలు మినహా అన్నిచోట్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. కుప్పం సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ భరత్కు ఏ డోకా లేకపోగా, ఇప్పటికే తిరుపతి సమన్వయకర్తగా భూమన అభినయ్, చంద్రగిరి సమన్వయకర్తగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లను ప్రకటించిన అధిష్టానం, మిగతా వారిపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పేర్లను ప్రకటించేంతవరకు ఎమ్మెల్యేలు, మంత్రుల్లో టెన్షన్ వీడేలా లేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, వెంకటే గౌడ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తోపాటు మంత్రులు ఆర్కే రోజా, నారాయణ స్వామి టికెట్ల విషయంలోనూ అయోమయం నెలకొంది. వైసీపీ రెండు రోజుల క్రితం విడుదల చేసిన మూడో జాబితాలో శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి పేరు ఉంటుందని భావించినా జాబితాలో మాత్రం కనిపించలేదు. ఇక పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ విషయంలో మార్పులు ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతున్నా వాళ్లని కంటిన్యూ చేస్తున్నట్లు వైసీపీ హై కమాండ్ ప్రకటన చేస్తే తప్ప టెన్షన్ వీడేటట్లు లేదు.మంత్రి ఆర్కే రోజా కూడా మూడోసారి పోటీకి వైసీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చేలా కనిపిస్తుండగా, గంగాధర నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విషయం ఇంకా దోబూచులాడుతూనే ఉంది. స్వామికి టికెట్ ఇవ్వద్దని ఆయన వ్యతిరేకవర్గం గట్టిగా పట్టుబడుతుండడంతో వైసీపీ పునరాలోచిస్తోంది. స్వామిని చిత్తూరు ఎంపీగా పంపాలా లేక నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మిని గంగాధర నెల్లూరు సమన్వయకర్తను చేయాలా అన్నదానిపై కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరి పనితీరు బాగా లేదన్న సర్వేలు, సామాజిక సమీకరణలు, క్యాడర్లో ఉన్న వ్యతిరేకతలను పరిగణలోకి తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్న వైసీపీ హై కమాండ్ నో లాబింగ్ అన్నట్లు వ్యవహరిస్తుండడం సిట్టింగ్ లను కలవర పెట్టిస్తోంది. దీంతో ఎడతెగని పంచాయితీ కొనసాగుతోంది. వైసీపీ విడుదల చేసే 4వ జాబితాలో కొత్త ముఖాలు తెర మీదికి వస్తాయా లేక ఉన్న వాళ్ళేకే ఛాన్స్ దక్కుతుందా అన్న విషయం తేలిపోనుండగా కట్టలు తెంచే ఉత్కంఠ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది.