సిరా న్యూస్,పిఠాపురం;
మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడుతున్నారని,చేయనివి చేసినట్లుగా చూపిస్తూ,వారు పబ్బం గడుపుతూన్నారేగానీ పట్టణ ప్రజలకు మాత్రం త్రాగునీరు సక్రమంగా అందించట్లేదంటూ పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమీషనరుపై విరుచుకుపడ్డారు.పిఠాపురం పట్టణంలో త్రాగునీటి సమస్య అంశంపై పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోగల కౌన్సిల్ హాల్లో జరిగిన అత్యవసర సమావేశంలో వైసీపీ,టీడీపీ సభ్యులంతా మూకుమ్మడిగా మున్సిపల్ కమీషనరును నిలదీశారు.ఇన్ఛార్జ్ ఛైర్ పర్సనుగా మొదటి వైస్ ఛైర్ పర్సన్ పచ్చిమళ్ళ జ్యోతీఅప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు బొజ్జా జగదీశ్వరీదేవి,బోను దేవా,అల్లవరపు నగేశ్,తలిశెట్టి వేంకటేశ్వరరావు,కోళ్ళ బంగారుబాబు పట్టణంలో దారుణంగా నెలకొనిఉన్న త్రాగునీటి సమస్యపై కమీషనరు కనకారావును నిలదీశారు.ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు కుమ్మక్కై,పెద్దయెత్తున అవినీతికి పాల్పడుతూన్నారని,నిర్లక్ష్యంగా ఉంటూ లక్షలాది రూపాయలు మున్సిపాలిటీ సొమ్మును దుర్వినియోగపరుస్తూ ప్రజలకు త్రాగునీరుకూడా లేకుండా చేస్తూన్నారంటూ పలు ఆరోపణలు చేశారు.ఎంతమంది అధికారులు,సిబ్బంది అవినీతికి పాల్పడుతూ మున్సిపాలిటీ సొమ్మును ఎంత కాజేస్తున్నారో తనదగ్గర ఆధారాలున్నాయని,తదుపరి సమావేశంలో అవన్నీ బయటపెడతానంటూ కౌన్సిలర్ తలిశెట్టి వేంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.కమీషనర్ కనకారావు,అలాగే ఉన్నతాధికారులు పిఠాపురం మున్సిపల్ ఇంజనీరింగ్,వాటర్ వర్క్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టిపెట్టి,అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేసి,ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌన్సిలర్ బొజ్జా జగదీశ్వరీదేవి విజ్ఞప్తి చేశారు..