ఏడుకు చేరిన గుడ్డు ధర

 సిరా న్యూస్,హైదరాబాద్;
కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. సరఫరాలో కొరత కారణంగా కోడి గుడ్ల ధర పెరిగింది. గత వేసవితో పోలిస్తే నగరంలో గుడ్ల ధర గణనీయంగా పెరిగింది. 100 గుడ్ల ధర గతేడాది మే 4న రూ.420 ఉండగా, ఈ ఏడాది రూ.445కి పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా కోళ్లు మరణించాయని.. అందుకే గుడ్డు ధర పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెల రోజులుగా గుడ్డు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత నెలకు, ఈ నెలకు గుడ్డు ధర 70 పైసలు పెరిగింది. ఉదాహరణకు, ఏప్రిల్ 5న రూ.4.35 ఉన్న గుడ్డు ఇప్పుడు మే 5 నాటికి రూ.5.25కు చేరింది. బయట రిటైల్ షాపుల్లో గుడ్డును 6 నుంచి 7 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఏది ఏమైనప్పటికీ, గత ఐదు రోజులలో మే ఎంటరయ్యక గుడ్డు ధర పెరుగుదల పీక్‌కి చేరింది.ఒక్కసారిగా గుడ్డు ధర పెరగడంతో.. కొందామని షాపుకు వెళ్లిన మధ్యతరగతి వారు ధర చూసి నోరెళ్లబెడుతున్నారు. రోజుకో గుడ్డు తినే అలవాటు ఉన్నవారు.. ఇకపై వారంలో రెండు రోజులకోసారి తినాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కరోనా సమయం నుంచి.. జనాలు కూడా గుడ్డును తిండిలో భాగం చేశారు. ఇప్పుడు అది లేకపోతే ఏదో వెలితిగా ఉంది అంటున్నారు. మరోవైపు కోడిగుడ్ల రేట్లు పెరగడంతో వ్యాపారం సరిగ్గా జరగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *