భారీగా పెరిగిన కూరల ధరలు

సిరా న్యూస్,కాకినాడ;
ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. కూరగాయలు, నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి.ఇటీవల వర్షాలకు కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో దిగుబడులు తగ్గి కూరగాయలకు భారీ డిమాండ్ పెరిగింది. మార్కెట్లలో కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయలు, బెండకాయ, బీరకాయ, సొరకాయ, చిక్కుడుకాయ…ఇలా ఒక్కొక్కటీ సెంచరీకి చేరువలో ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పచ్చిమిర్చి కిలో రూ.80 ఉండగా, ఇక కొత్తిమీర అయితే కిలో రూ.200 పలుకుతుంది. పలు జిల్లాల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టామాటాలు రూ.40-రూ.50 మధ్య పలుకుతుండగా, చిక్కుడు కిలో రూ.100, బీరకాయ రూ.80, బెండకాయ రూ.70, క్యారెట్ రూ.100, కాకరకాయ రూ.80, క్యాలీఫ్లవర్ రూ.80 పలుకుతున్నాయి.గతంలో రూ.300 కూరగాయలు ‌కొనుగోలు చేస్తే వారానికి సరిపడేవని, ఇప్పుడు కేవలం రెండు, మూడు రోజులకు మాత్రమే వస్తున్నాయని సామాన్యులు అంటున్నారు. ఉల్లిపాయలు కిలో రూ. 60 నుంచి రూ.70 పలుకుతున్నాయి.అతివృష్టితో తోటలు పాడవడంతో కూరగాయల రేట్లు భారీగా పెరిగాయని రైతులు అంటున్నారు. ఇలానే వర్షాలు కొనసాగితే కూరగాయల ధరలు 100 రూపాయలు దాటే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు. గతంలో టమాటాలు, ఉల్లి ఇలా ఏదో ఒకదాని ధర మాత్రమే అమాంతం పెరిగేవి. ఇప్పుడు అన్ని కూరగాయల ధరలు ఒకేసారి పెరుగుతుండడంతో వినియోగదారులపై మరింత భారం పెరుగుతోంది. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడంతో… వాటి ధరలు భారీగా పెరిగాయి. 15 కిలోల డబ్బా ధర రూ.1730 నుంచి రూ.2 వేలకు పెరిగింది. కిలో నూనె ప్యాకెట్‌ ధర రూ.108 నుంచి రూ.125కు పెరిగింది. గ్రామాల్లో అయితే కిలో ఆయిల్‌ ప్యాకెట్‌కు అదనంగా రూ.5 పెంచి అమ్ముతున్నారు. నిత్యావసరాల ధరలు మండిపోతుంటే ఇప్పుడు వాటికి నూనె ధరలు తోడైయ్యాయని వినియోగదారులు వాపోతున్నారు. అసలే పండుగ సీజన్ కావడంతో సామాన్యుడి జేబుపై మరింత భారం పడుతోందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *