మల్కాజ్ గిరి బరిలో అరడజను నేతలు

సిరా న్యూస్, హైదరాబాద్;
బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది మల్కాజ్‌గిరి లోక్‌స‌భ స్థానం. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు అరడజను మంది నాయకులు పోటీ పడుతున్నారు. బీజేపీలోని కీలక నేతలతో పాటు విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు సైతం టికెట్ ఆశిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ కార్యక్రమాలతో కొంతమంది ప్రజల్లోకి వెళ్తుండగా.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మరికొందరు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో ఇంకొంత మంది అధిష్టానం మనసు దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.మల్కాజ్‌గిరి నియోజకవర్గం. దేశంలోనే అతిపెద్ద లోక్‌స‌భ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సుమారు 4 వేలకు పైగా పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. 35 లక్షల పైచిలుకు మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా సెటిల్ కావడంతో మినీ ఇండియాగా పిలుస్తారు. అయితే ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువైన పనేం కాదు. అయినా ఇక్కడ నుంచి పోటీకి బీజేపీ నేతలు సై అంటున్నారు. తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు పోటీ పడుతున్నారు.ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఈటల రాజేందర్, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు తో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య టికెట్ ఆశిస్తున్నారు. ఈటల రాజేందర్ విషయానికి వస్తే హుజూరాబాద్, గజ్వేల్‌లో ఓడిపోయిన అనంతరం ఎంపీ బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈటల దృష్టి మల్కాజ్‌గిరిపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న పరిచయాలతో పాటు మోదీ చరిష్మా ఈ నియోజకవర్గంలో తనను గెలిపిస్తాయని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్టు సమాచారం.బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు సైతం మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్నారు. రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో కలియతిరుగుతూ ప్రజల మధ్య ఉంటున్నారాయన. బండి సంజయ్ ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సమయంలో నిత్యం ఆయన వెంట నడుస్తూ పాదయాత్రలో కనిపించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అంతే కాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలను భరత్ దర్శన్ యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలకు తీసుకుని వెళ్తారాయన.వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మల్క కొమురయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్‌ను స్థాపించి అనతి కాలంలోనే అనేక విద్యా సంస్థల అధినేతగా పారిశ్రామికవేత్తగా ఎదిగారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 15 పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను అదిస్తున్నారాయన. సొంతంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి 25శాతం మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి 88 మెగావాట్ల విద్యుత్‌ను తయారు చేస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు సాయం చేస్తున్నారు. తన సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో మల్కాజ్‌గిరి నుంచి పోటీకి సై అంటున్నారు.మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ సైతం మల్కాజ్‌గిరి టికెట్ పై ఆశాలు పెట్టుకున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి లాంటి నేతలు సైతం టికెట్ ఆశిస్తున్నారు. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *