సత్వర న్యాయం జరిగేది ఎన్నడు…

నేరచరితులే పాలకులైతే…
సిరా న్యూస్;
ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. అయితే, మన ఎన్నికల్లో అంగబలం, అర్థబలం లేనిదే పోటీ చేయటం సాధ్యమేనా? ఒకవేళ ప్రజాబలాన్ని నమ్ముకుని బరిలో దిగితే ఏమవుతుంది? వంటి ప్రశ్నలకు జవాబులేమిటో మనందరికీ స్పష్టంగా తెలుసు. ఒకప్పుడు సమాజంలో గౌరవ మర్యాదలు, సేవాభావం, నిజాయితీ ఉన్న నేతలు పావలా ఖర్చు లేకుండానే చట్టసభలకు ఎన్నికై ప్రజాసేవ చేసేవారు. కానీ, నేడు అర్థబలం, కులబలం ఉన్న నేతలో చట్టసభలకు ఎన్నిక కాగలుగుతున్నారు. తాజాగా నేర చరిత్ర కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో ఒక అదనపు అర్హతగా మారుతోందేమోననే అనుమానాలు వస్తున్నాయి. హత్యలు, మానభంగాలు, వంటి తీవ్రనేరాలకు పాల్పడి, కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా నిస్సంకోచంగా చట్టసభలకు పోటీచేయటమే గాక గెలిచి, మంత్రులు కావటాన్నీ నేడు మనం చూస్తున్నాం. తాజాగా జరిగిన 18 లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల నేపథ్యాలపై విడుదలైన తాజా జాతీయ నివేదికలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.లోక్‌సభలోని 545 స్థానాలకు ఈసారి మొత్తం 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 1,333 మంది జాతీయ పార్టీల తరపున, 532 మంది ప్రాంతీయ పార్టీల నుంచి పోటీపడగా, 2,580 మంది రిజిస్టర్డ్‌ పార్టీల నుంచి బరిలో నిలిచారు. వీరుగాక 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. వీరిలో 8,337 మంది అఫిడవిట్లను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు పరిశీలించి ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. బరిలో నిలిచిన వారిలో 20 శాతం (1,643) మంది మీద క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడి వంటి తీవ్రమైన కేసులున్నాయి. క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది.పార్టీల పరంగా చూస్తే.. నేర చరిత్ర గల అభ్యర్థుల విషయంలో బీజేపీ ముందువరుసలో నిలిచింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన 440 మందిలో 191 మంది నేర చరితులే కాగా కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన 327 మంది అభ్యర్థుల్లో 143 మందికి నేర చరిత్ర ఉంది. బీఎస్పీ నుంచి 487 మంది పోటీ చేయగా వారిలో 63 మంది, సీపీఎం 52 మంది అభ్యర్థుల్లో 33 మందికి నేర చరిత్ర ఉంది. 3915 మంది ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో 550 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారే. రాష్ట్రాల వారీగా చూసినప్పుడు, ఈ జాబితాలో కేరళ ముందువరసలో ఉంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న నాలుగు ప్రధాన పార్టీల నుంచి మొత్తం 53 మంది బరిలో ఉంటే.. వారిలో 34 మంది నేరచరితులేనని ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ)’ తెలిపింది. వీరిలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి 12 మంది చొప్పున, తొమ్మిదిమంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ఒక మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ అభ్యర్థుల్లో 40 శాతం మంది ఏదో ఒక నేరానికి పాల్పడిన వారేనని ఈ నివేదిక తెలిపింది. 2009లో గెలిచిన ఎంపీలలో 30శాతం మందికి నేర చరిత్ర ఉండగా, 2014లో ఎన్నికైన వారిలో 34 శాతం మంది మీద క్రిమినల్ రికార్డులున్నాయి. 2019 నాటికి ఇది 43 శాతానికి పెరగగా, ప్రస్తుత లోక్‌సభ ఎంపీల్లో ఏకంగా 46 శాతానికి పెరిగింది. 18వ లోక్‌సభకు ఎన్నికైన బిజెపి ఎంపీల్లో 39 శాతం మంది నేర చరిత్ర కలిగి ఉండగా, కాంగ్రెస్ ఎంపీలలో 49శాతం, టిడిపి ఎంపీల్లో 50శాతం, వైసిపి ఎంపీల్లో 25శాతం మంది నేర చరిత్ర కలిగి ఉన్నారు.చట్టసభల్లో నేరచరితులు అడుగుపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో గతంలో తెచ్చిన ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 8 (3) ప్రకారం ఒక వ్యక్తి నేరం చేసినట్లు నిర్థారణై, రెండేళ్లకు పైబడి శిక్ష పడితే సదరు వ్యక్తి జైలు నుంచి విడుదలైన తేదీ నుంచి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. అయితే ఈ చట్టం కట్టుదిట్టంగా ఉన్నా, సత్వర న్యాయం అందని కారణంగా, వారు చేసిన నేరానికి కోర్టులు తగిన శిక్ష విధించినప్పుడే ఈ రూల్ అమలవుతోంది. ఈ విచారణా కాలంలోనే నేరగాళ్లు చట్టసభలకు పోటీచేసి, చట్ట సభల సభ్యులుగా చట్టాలను రూపొందిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వీరు మంత్రులు కూడా కాగా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో హోం మంత్రులుగానూ బాధ్యతలు చేపట్టారు. ఈ దుస్థితిని ప్రస్తావిస్తూ చార్జిషీటు దాఖలైన వారిని అనర్హులుగా ప్రకటించాలని గతంలో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. చట్టాలు చేయటం తన పని కాదనీ, అలాంటి చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే.. ఎంపీ, ఎమ్మెల్యేల మీదున్న క్రిమినల్ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలంటూ ఏడేళ్ల కిందట సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా పరిస్థితిలో ఆశించిన మార్పేమీ రాలేదు.మనలో చాలామంది చట్టసభలలోకి నేర చరితులు అడుగుపెట్టకుండా అడ్డుకునే బాధ్యత రాజ్యాంగ సంస్థలదేనని చేతులు దులుపుకుంటున్నాం గానీ, వారికి ఓటు వేసి చట్టసభలకు పంపుతున్నది మనమేనని గుర్తించలేకపోతున్నాం. ఓటర్లకు పలు తాయిలాలు ఎరచూపి ఎలాగోలా ఎన్నికల్లో నెగ్గుతున్న నేతల కుట్రలను గమనించాకైనా జనంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్వచ్ఛ చరిత్రగల, సమర్థవంతులైన నేతలు చట్టసభలకు ఎన్నిక కాగలుగుతారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *