17 నుంచి తిరుప్పావై…

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులపాటు సుప్రభాతం కాకుండా తిరుప్పావై జరగనుంది. డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై సేవ జరగనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 17 తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానుండగా టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 17 ఉదయం నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించనున్నారు.ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి గంటన్నర ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారట. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉండగా నెలరోజులు ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం జరగనుంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరుకాగా ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం కాగా తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకొకటి చొప్పున అర్చకులు నివేదిస్తారు. ఈ సమయంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *