బుధవారం నుంచి గ్రేటర్‌ బస్ ప్రయాణికులకు ఇక్కట్లే..

– మేడారం జాతరకు గ్రేటర్‌ జోన్‌నుంచి 1800 సిటీబస్సులను
– హైదరాబాద్‌ నుంచి జాతరకు మరో 400 బస్సులు
– ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ నుంచి స్పెషల్‌ ఆపరేషన్స్‌
హైదరాబాద్‌;
మేడారం జాతర ఎఫెక్ట్‌తో నగరంలోని సిటీబస్సు ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేట్లు లేవు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు గ్రేటర్‌ జోన్‌నుంచి 1800 సిటీబస్సులను నడిపించాలని నిర్ణయించారు. దీంతో గ్రేటర్‌ జోన్‌లో పరిధిలో బుధవారం నుంచి శనివారం వరకు 800 బస్సులు మాత్రమే తిరగనుండడంతో ఏమేరకు సేవలు అందిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.గ్రేటర్‌జోన్‌ వ్యాప్తంగా ప్రతిరోజు ఆర్టీసీ 2,640 బస్సులు నడుపుతూ 21 లక్షలమంది సిటీ ప్రయాణికులను చేరవేస్తోంది. ఈనెల 21నుంచి మేడారం సమ్మక-సారలమ్మ జాతర ప్రారంభ నేపథ్యంలో గ్రేటర్‌జోన్‌ నుంచి సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా 600 చొప్పున మొత్తం 1800 సిటీ బస్సులను జాతరకు వెళ్లే భక్తులకోసం ఆర్టీసీ కేటాయించింది.జాతరకు లక్షల సంఖ్యలో వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకొని టీఎ్‌సఆర్టీసీ మొత్తం 6 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. జాతర ప్రాంగణానికి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా గ్రేటర్‌కు చెందిన సిటీబస్సులను నడపనున్నారు. ఈ బస్సులు ఈనెల 21నుంచి 24 వరకు అక్కడే ఉండి భక్తులకు సేవలందించనున్నాయి. దీంతో సోమవారం 2040 బస్సులు, మంగళవారం 1440 బస్సులు, బుధవారం నుంచి శనివారం వరకు గ్రేటర్‌ జోన్‌లో 800 బస్సులు మాత్రమే సిటీ ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. 70 శాతం సిటీబస్సులు జాతరకు తరలివెళ్లడంతో సిటీ ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు చూసుకోవాల్సి ఉంటుంది. మేడారం స్పెషల్‌ ఆపరేషన్స్‌కు బస్సులు వెళ్తుండడంతో సిటీ ప్రయాణికులు తమకు సహకరించాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.మేడారం జాతరను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఈనెల 19 నుంచి శనివారం వరకు ఆర్టీసీ 4 వందల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌, ఉప్పల్‌ ప్రాంతాల నుంచి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *