సిరా న్యూస్,విశాఖపట్టణం;
ప్రస్తుతం హాట్ సిటీ విశాఖ. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విశాఖపట్నంకు ఢోకా ఉండదు. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారాన్ని చేపడితే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా విశాఖలోనే చేసి, అక్కడ నుంచే పాలన కొనసాగిస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కూడా తమ రాజధాని అమరావతి అయినప్పటికీ.. విశాఖని ఆర్థిక రాజధానిగా, ముంబై లాంటి నగరంగా తీర్చిద్దుతామని అనేకసార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయంలో కీలక భాగస్వామిగా ఉన్న విశాఖ నగరంపై ఆధిపత్యం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టి ప్రయత్నాలు చేశాయి.గతంలో రెండు నియోజకవర్గాలకే పరిమితమైన విశాఖ నగరం 2009 పునర్విభజన తర్వాత నాలుగు నియోజకవర్గాలుగా రూపాంతరం చెందింది. విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ నియోజకవర్గాలుగా రూపాంతరం చెందింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఈ నగరంలో 2009లో విశాఖ నార్త్, వెస్ట్, సౌత్ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఒక్క ఈస్ట్ మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో 2014, 2019లో రెండుసార్లు నాలుగు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీలో ఆధిపత్యం కోసం అప్పట్లో విఫల ప్రయత్నమే చేసింది. 2014లో ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, నార్త్ నుంచి అప్పటి కూటమి అభ్యర్థి అయిన విష్ణుకుమార్ రాజు, సౌత్ నుంచి ప్రస్తుతం వైసీపీలో ఉన్న అప్పటి టిడిపి నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్, వెస్ట్ నుంచి గణబాబులు విజయం సాధించారు. మళ్లీ 2019 లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు హ్యాట్రిక్ విజయం సాధించగా వెస్ట్ నుంచి గణబాబు, సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గెలుపొందారు. నార్త్ నుంచి కూడా గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో వైసిపి సామాజిక సమీకరణాలతో అభ్యర్ధులను రంగంలోకి దింపినా విజయం సాధించలేకపోయింది.దీనికి కారణాలుగా అనేక అంశాలని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. మొదటిది అర్బన్ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి పట్టు లేదనడం ఒకటి అయితే, విద్యావంతులు, ధనికులు ఎక్కువగా ఉన్నచోట వైఎస్ఆర్సిపి కంటే టిడిపికి ఆదరణ ఎక్కువ ఉంటుందన్న భావం కూడా ప్రచారంలో ఉంది. అదే సమయంలో విశాఖపట్నంపై తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేకమైన అభిమానాన్నే చూపిస్తూ వచ్చేది. గతంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వరుసగా మూడుసార్లు పెట్టుబడుల సదస్సుని విశాఖలో నిర్వహించడంతోపాటు.. అంతకుముందు హుద్ హుద్ సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు విశాఖలోనే బస చేసి నగర పునరాభివృద్ధి కోసం చేసిన కృషి కూడా నగరవాసుల్ని ఆకట్టుకుందని తెలుస్తోంది. అందుకే విశాఖ ప్రజలు రెండుసార్లు తెలుగుదేశంకే పట్టం కట్టారంటూ అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తూ వచ్చాయి. దానికి తోడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే విశాఖలో కూడా కీలకమైన రంగాలలో అగ్రస్థానంలో ఉండడంతో, ఆ పట్టు కొనసాగుతుందన్న అభిప్రాయము కలుగుతూ వచ్చింది.అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నగరంపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో పట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలను తొలగించే ప్రయత్నం.. ఒక సామాజిక వర్గ నేతలకు చెందిన ఆస్తులపై దాడులు చేస్తున్నారంటూ పెద్ద చర్చే జరిగింది. ఈ పరిస్థితుల్లో అందరి అంచనాలకు భిన్నంగా 2021లో జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి అద్భుతమైన వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేయడంతో జీవీఎంసీని వైసిపి హస్తగతం చేసుకుంది. సిటీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న టిడిపికి నగర పరిధిలో పరాజయం లభించేలా విజయసాయి రెడ్డి పార్టీని నడిపించారని చెబుతుంటారు. మొత్తం 98 మున్సిపల్ డివిజన్లో 60 వరకు డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష టిడిపి జీవీఎంసీలో ప్రతిపక్షానికే పరిమితమైంది.