సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పాలి..
-తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆదివాసి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తమ గళం విప్పాలని, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆదివాసి భవన్ లో ఏర్పాటు చేసిన ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) జిల్లా కమిటీ ఎన్నికలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పూర్క బాపురావు, వేట్టీ మనోజ్ లతో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు శాలువలు, పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగం లోని 324 ఆర్టికల్ ఆమోదం లేకుండా లంబాడాలు అక్రమంగా ఎస్టీ జాబితా లో కొనసాగుతున్నారని అన్నారు. నూతనంగా గెలిచిన ఆదివాసి ఎమ్మెల్యేలంతా, లంబాడీలు ఎస్టీ కాదనే అంశాన్ని అసెంబ్లీ లో మాట్లాడాలని, ఆ దిశగా ఆదివాసి సమాజం వారిపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. లంబాడాలు ఎస్టీ జాబితా లో కలిసి 47 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ప్రశ్నించేవారు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కాగా ఆదివాసి నిరుద్యోగులకు ఏజెన్సీ సర్టిఫికెట్ లు జారీ చేయకపోవడంతో, షెడ్యూల్ ప్రాంతం లో ఉన్న 29 శాఖల జీఓ లు అమలు కాక, ఆదివాసీలు నాన గోస పడుతున్నారని అన్నారు. ఐటీడిఏ లలో జరగాల్సిన ప్రమోషన్ లు, ట్రాన్స్ఫర్ లు 5 వ షెడ్యూల్ కి విరుద్ధంగా జీఓ 317 పేరిట నూతన జోనల్ పద్ధతిలో నిర్వహించడం తో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్నక విజయ్, సాంస్కృతిక కార్య దర్శి ఆగబోయిన రవి, పోలిట్ బ్యూరో చైర్మన్ మెస్రం మోతిరాం, రాష్ట్ర కమిటీ సభ్యులు కొడప నగేశ్, నాయకులు జడెక్ పాండు రంగ, ఊయిక సంజీవ్, కుమ్ర శ్యామ్ రావు సుదర్శన్ ఉయిక, జంగు, తదితరులు పాల్గొన్నారు.