సిరా న్యూస్, గుడిహత్నూర్:
గుడిహత్నూర్ లో మళ్లీ పులి కలకలం…
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో పులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. ఇటీవలే గుడిహత్నూర్ శివారు ప్రాంతంలో ఓ ఆవును పులి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఈ ఘటన మరువక ముందే, శనివారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామ శివారు చేన్ల నుండి మళ్లీ పులి గాండ్రింపులు వినబడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పులి అక్కడక్కడే తిరుగుతున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్, బజార్ హత్నూర్, గుడిహత్నూర్ మండలాలలో తరచుగా పులి సంచారం చేస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కూలి పనులు, చేను పనులకు వెళ్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం పక్కనే ఉండడంతో, అక్కడినుండి పులులు ఆదిలాబాద్ జిల్లాకు తరుచుగా రాకపోకలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు దీనిపై ప్రత్యేక చొరవ చూపి, ప్రజల్లో నెలకొని ఉన్న భయాందోళనలను దూరం చేయాలని వేడుకుంటున్నారు.