జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం – నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.. జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.1974లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించాడు.దర్శకుడిగా కాకుండా నటుడిగా సైతం మెప్పించాడు జంధ్యాల. కళా తపస్వీ దర్శకత్వం వహించిన ‘ఆపద్భాందవుడు’లో అద్భుతాభినయాన్ని కనపరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటుడిగా, రచయతగా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించి మెప్పించాడు జంధ్యాల. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్గా సైతం మెప్పించారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు సాహితి, సంపద. జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించాడు.
—