-పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత
-నిబంధనలు పాటించనిచో జరిమానాలు విధిస్తాం
-మంథని మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి హెచ్చరిక
సిరా న్యూస్,మంథని;
మంథని మున్సిపల్ పరిధిలోని వర్తక, వాణిజ్య వ్యాపారాలు నిర్వహించే నిర్వాహకులు మున్సిపల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి సూచించారు.
సోమవారం మంథని పట్టణంలోని పలు వీధులను మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదరాలను వేస్తూ తమ పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడమే కాకుండా చుట్టుపక్కల వారికి అసౌకర్యాలు కలిగిస్తున్నారని అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని లేనిపక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేస్తూ జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు.
నిత్యం తమ సిబ్బంది వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నారని అయినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు తమ దుకాణాలలోని చెత్తను ఇష్టాను రీతిలో రోడ్లపై వేస్తున్నారని అటువంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో సహించబోమని కచ్చితంగా మున్సిపల్ సిబ్బందికి సహకరిస్తూ వ్యాపారాలను నిర్వహించుకోవాలని సూచించారు.
మంథని కేంద్రం మనందరికీ ఇల్లు లాంటిదని మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని ఆ బాధ్యతను ప్రతి ఒక్కరు కచ్చితంగా నిర్వర్తించాల్సిందేనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వీకే రవి, చొప్పకట్ల హనుమంతు, కుర్ర లింగయ్య లతోపాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
===============================