సిరా న్యూస్,ఖమ్మం;
తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు ఈసారి ఎవరికి దక్కనున్నాయనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని సీమాంధ్ర ఓటర్లలోని ఈ రెండు పార్టీల ఓటర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రధాన నేతగా ఉన్న కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి తెలంగాణ ఎంపీ ఎన్నికల బరి నుంచి ఈ రెండు పార్టీలు తప్పుకున్నాయి. కాగా, ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మద్దతు బీజేపీకేనని బుధవారం టీటీడీపీ ప్రకటించింది. బీజేపీ నేత మాజీఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి టీటీడీపీ నేతలతో చర్చల అనంతరం.. తమ పార్టీ ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇవ్వనుందని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే దీనిని ప్రకటిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఎలాంటి బేషజాలకు పోకుండా.. బీజేపీకి ఓటు వేయాలని రెండు పార్టీలు కోరాయి. అయితే, ఈ ప్రకటనతో బీజేపీకి ఒరిగేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.రాష్ట్రంలోని పలు జిల్లాలు, పలు పార్లమెంట్స్థానాల్లో టీడీపీకి ఇంకా కేడర్ ఉంది. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పార్టీకి ఇప్పటికీ కొంత పట్టుంది. మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ సెగ్మెంట్లలో నేటికీ ఆ పార్టీకి కనీస స్థాయి క్యాడర్ ఉండగా, ఖమ్మం, మల్కాజిగిరి సీట్లలో గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో నేటికీ టీడీపీకి బలం ఉంది. ఇక.. భువనగిరి స్థానం పరిధిలోని మునుగోడు, ఇబ్రహీంపట్నం.. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కోదాడ, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవటంతో ఆ పార్టీ బలం వేగంగా తగ్గినా.. ఉనికి మాత్రం నిలిచే ఉంది.తెలంగాణలో నివసిస్తున్న చాలమంది సీమాంధ్రులకు తెలంగాణతో బాటు ఏపీలోనూ ఓట్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వారిలో చాలామంది ఇక్కడ తమ ఓటును కాంగ్రెస్కు, కొన్ని వర్గాలు బీఆర్ఎస్కు ఓటు వేశాయి. అయితే, ఈసారి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగటంతో వీరిలో చాలామంది అక్కడికి వెళ్లి ఓటు వేయటానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనలు అక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలకు ఎవరికీ ఇష్టంగా లేదు. అమరావతిని ధ్వంసం చేస్తుంటే మోదీ చూస్తూ ఉండిపోవటం, చంద్రబాబు అరెస్టు, పవన్ కల్యాణ్, జనసేన కార్యకర్తలు,నేతలను అక్కడి ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టిన సందర్భంలోనూ ప్రధాని మోదీ ఏనాడూ నోరెత్తి మాట్లాడలేదు. 2017 తర్వాత చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని నిధుల విషయంలో, పాలనా పరమైన విషయాల్లో నానా తిప్పలు పెట్టిన కేంద్రంలోని బీజేపీ, గడిచిన ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి పెద్దన్నలా వ్యవహరించి, ఆదుకుందనే కోపం కూడా సీమాంధ్ర ఓటర్లలో మెజారిటీ వర్గాలకు ఉంది. జగన్తో కలిసి పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయమని తెలిసి, తప్పనిసరి పరిస్థితిలోనే బీజేపీ.. టీడీపీ, జనసేన పొత్తులో భాగస్వామి అయిందని వారు భావిస్తున్నారు.2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ, నేటికీ సీమాంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణలో స్థిరపడిన సెటిలర్లకు.. నేటికీ తమ ప్రాంతంతో మానసిక బంధం ఇంకా బలంగానే ఉంది. రాజకీయంగా, సాంస్కృతికంగా వారు నేటికీ ఏపీలో జరిగే ప్రతి మార్పుకూ చురుగ్గా స్పందిస్తూనే ఉన్నారు. ఇక, ఇక్కడి టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు, సానుభూతిపరుల్లో ఇది మరింత ప్రబలంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు అరెస్టు సమయంలో వారు ఇక్కడ నిరసనలు తెలిపారు. ఈ అరెస్టుకు మోదీ మద్దతు కూడా ఉందని భావించి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేశారు. ఆ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని సీట్లనూ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ, సీమాంధ్రుల్లో టీడీపీ, జనసేన పార్టీల వారిలో మెజారిటీ వర్గం కాంగ్రెస్కు ఓటు వేశారనే వాస్తవాన్ని కొట్టిపారేయటం సాధ్యం కాదు. మరోవైపు.. ఖమ్మం జిల్లాలో టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్కే పడినట్లు అక్కడి గణాంకాలే చెబుతున్నాయి.మరోవైపు తెలంగాణలోని సీమాంధ్ర టీడీపీ వర్గాల మనసులో రేవంత్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉందనేదీ బహిరంగ సత్యమే. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఇది స్పష్టంగా రుజువైంది. రేవంత్ సీఎం అయినవేళ.. గాంధీభవన్ ర్యాలీలోనూ టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు అరెస్టుపై నిరసన తెలిపిన కార్యకర్తలపై కేటీఆర్ నోరుపారేసుకున్న వేళ.. వారు బహిరంగంగానే తాము ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నామో చెప్పకనే చెప్పారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ వారిపట్ల తనకున్న ప్రేమను బహిరంగంగానే ముఖ్యమంత్రి హోదాలోనూ రేవంత్ రెడ్డి చాటుకుంటూ వస్తున్నారు. పైగా, గత అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న అస్పష్టత కూడా ఇప్పుడు తెలంగాణలో లేదు గనుక ఈసారి వారంతా తప్పక హస్తానికే ఓటేస్తారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
=============