సిరాన్యూస్,ఓదెల
ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
* పెద్దరాతుపల్లిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన
* కొలనూరులోని పీహెచ్సీ, ఓదెల- కొలనూరు రోడ్డు ప్రారంభం
ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణా రావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్బంగా ఓదెల మండలం కొలనూరు గ్రామం చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 13 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పెద్దపల్లి నుంచి ఓదెల వయా కొత్తపల్లి, కొలనూరు వరకు వెళ్ళే రోడ్డును, కోటి 56 లక్షల వ్యయంతో నిర్మించిన కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రులు, అక్కడ తిరుమల ఆయిల్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిచే 170 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రుల బృందం శంకుస్థాపన చేసి అనంతరం కాల్వ శ్రీరాంపూర్ రెడ్డి గార్డెన్స్ లో ఆయిల్ పామ్ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఆయిల్ పామ్ సాగు అంతర్ పంటల సాగు, వాటితో వచ్చే ఆదాయం వంటి పలు అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. పెద్దపెల్లి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఇప్పటి వరకు 2500 ఎకరాల వరకు మాత్రమే జరిగిందని , ప్రస్తుత సంవత్సరం ఆయిల్ పామ్ విస్తిర్ణం 10 వేల ఎకరాలకు పెరగాలని, ఆసక్తి గల రైతులందరిని ఆయిల్ పామ్ దిశగా మళ్ళీంచాలని అన్నారు. ఆయిల్ పామ్ పంట మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటల ద్వారా ఆదాయం వస్తుందని, రైతులు పొద్దు తిరుగుడు అంతర్ పంట క్రింద వేస్తే ఇదే కంపెనీ మద్దతు ధరపై కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ అధికారుల సూచనలు రైతులు పాటించాలని అన్నారు. మనకు అందుబాటులో ఉన్న భూమి లోనే ఎక్కువ పంటలు పండించాలని, రైతులు పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. మనకు అవసరమైన అన్ని రకాల నేలలు వాతావరణం, వనరులు అందుబాటులో ఉన్నాయని వీటిని వినియోగించుకొవాలని అన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలకు, మందులకు, డ్రిప్ ఏర్పాటుకు సైతం సబ్సిడీ అందజేస్తామని అన్నారు. అనంతరం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,*ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు ఎకరానికి ఖర్చులు పోగా లక్ష వరకు ఆదాయం వస్తుందని, దీనికి కోతుల బెడద ఉండదని, రైతుల వద్ద నుంచి ఆయిల్ పామ్ కొనుగోలు చేసేందుకు తిరుమల ఆయిల్ కెమికల్స్ కంపెనీ ద్వారా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మనకు అవసరం ఉన్న తినే ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీనిని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తరించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ పనిచేస్తుందని , మన పెద్దపల్లి జిల్లాలో సైతం 45 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంటల సాగు జరగాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ క్రమ శిక్షణతో ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు విస్తరణ వంటి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, 170 కోట్లతో నిర్మిస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు టి.భాను ప్రసాద్ రావు, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అదనపు కలెక్టర్ లు జే .అరుణ శ్రీ , జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, డిసిపి ఎం.చేతన , రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సీఈఓ కేశవ్ కళ్యాణ్ కర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.