సిరా న్యూస్;
సైనికచర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన యుద్ధానికి నెలలో రెండేళ్లు పూర్తి కానుంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు – రష్యా మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఉక్రెయిన్ను యుద్ధక్షేత్రంగా మార్చింది. నిత్యం బాంబుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతున్నది. వేలాది మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు విడుస్తున్నారు. ఎందరో అమాయకులు, చిన్నారులు సైతం బాంబు దాడులకు బలయ్యారు. రూ.కోట్లు ఆయుధాల రూపంలో కాలిపోతున్నాయి. భవనాలు శిథిలాలుగా మారుతున్నాయి. వీధులు తుపాకీ చప్పుళ్లతో, సైనిక కవాతుతో మార్మోగుతున్నాయి. బంకర్లు ప్రజలతో నిండిపోతున్నాయి. ఏడాదిగా యుద్ధం మిగిల్చిన నష్టం అంతాఇంతా కాదు. కేవలం ఉక్రెయిన్, రష్యాపై మాత్రమే కాదు ప్రపంచమంతటిపై ఈ యుద్ధ ప్రభావం ఏదో రూపంలో పడింది.ఓ వైపు రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. మరో వైపు ఆ రెండు దేశాల సరిహద్దుల్లో దారుణం చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో రష్యా దేశానికి చెందిన ఒక విమానం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. యుద్ధం నేపథ్యంలో రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్ దేశానికి చెందిన సైనికులను సజీవంగా పట్టుకున్నాయి. వారిని యుద్ధ ఖైదీలుగా తమ దేశంలోని జైల్లో బంధించాయి. కారణాలు తెలియదు గాని రష్యా ఆ యుద్ధ ఖైదీలను ప్రత్యేక విమానంలో నిర్మానుష్య ప్రాంతానికి తరలిస్తోంది. యుద్ధ ఖైదీలు, ఆరుగురు రష్యా సైనిక సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి రష్యా సైనిక విమానం రన్ వే నుంచి బయలుదేరి వెళ్ళింది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గో రోడ్ ప్రాంతంలో కుప్పకూలింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో 65 మంది దుర్మరణం చెందారు.బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ విమానం కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 65 మంది మంటల్లో కాలిపోయారు. విమానంలో ఉన్న ఇంధనం ట్యాంకులు పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయని రష్యా రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంతవరకు తెలియ రాలేదు. అయితే రష్యా తమ దేశానికి చెందిన వారిని అక్రమంగా పట్టుకొని ఇలా కావాలనే చంపిందని.. దానికి ప్రమాదం జరిగిందని చెబుతోందని ఉక్రెయిన్ రక్షణ శాఖ ఆరోపిస్తోంది. రష్యా రక్షణ శాఖకు సంబంధించిన విమానం కూలిపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటోంది. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి రష్యా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.. ఈ ప్రమాదంలో ఎవరైనా బతికి బట్ట కట్టారా? అనే ప్రశ్నకు రష్యా రక్షణశాఖ వద్ద సమాధానం లేదు. ఈ ఘటన కు కారణాలు అన్వేషిస్తున్నామని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రత్యేక సైనిక మిషన్ విమానం కూలిన ప్రాంతానికి బయలుదేరిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా దళాలు సరిహద్దుల్లో మాటు వేసి ఉన్నాయి. అంతేకాదు ఉక్రెయిన్ దేశంలోనే పలు నగరాలను ఆక్రమించాయి. అయితే ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో రష్యా విజయం సాధించకపోయినప్పటికీ.. ఉక్రెయిన్ ఆర్థిక మూలాలపై తీవ్రంగా దెబ్బ కొట్టింది. నీటి ప్రాజెక్టులను నాశనం చేసింది. విద్యుత్ ప్రాజెక్టులను పేల్చివేసింది. పలు నగరాలలో కీలక కట్టడా లను కూల్చివేసింది. అయినప్పటికీ రష్యాకు ఉక్రెయిన్ వెన్ను చూపించలేదు. ఉక్రెయిన్ దేశానికి అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు అండదండలు అందిస్తుండడంతో యుద్ధం ఇంకా రావణకాష్టం లాగా రగులుతూనే ఉంది.అయితే ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా విమానం ప్రమాదం జరగడం.. వారంతా చనిపోవడంతో ఇదంతా రష్యాకు ఇష్టం లేకనే ఇలా ప్లాన్ చేసి చంపేసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తన ప్రత్యర్థులను అప్పగించడం కంటే చంపడానికే రష్యా మొగ్గు చూపుతుంది.అయితే.. తాజాగా ఈ అంశంపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగదని, ఇది సుదీర్ఘకాలం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టాడు. ప్రపంచ దేశాల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొందని ఆయన పేర్కొన్నాడు. ఉక్రెయిన్ దూకుడు పెంచి రష్యాపై ప్రతిదాడులు మొదలుపెట్టడం వల్ల.. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. జర్మనీకి చెందిన ఓ మీడియా గ్రూప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోల్టెన్బర్గ్ మాట్లాడుతూ.. ‘‘చాలా యుద్ధాలు మొదలైనప్పుడు, ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. కాబట్టి.. ఉక్రెయిన్లో సుదీర్ఘ యుద్ధానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి’’ అని తెలిపారు.ఉక్రెయిన్లో వీలైనంత త్వరగా శాంతి స్థాపించబడాలని తాను కోరుకుంటున్నానని స్టో్ల్టెన్బర్గ్ అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ, ఉక్రేనియన్లు తమ పోరాటం ఆపేస్తే.. అప్పుడు వారి దేశం తుడిచిపెట్టుకుపోతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ బలగాల్ని వెనక్కు రప్పిస్తే.. యుద్ధం సద్దుమణుగుతుందని పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి మాట్లాడుతూ.. తప్పకుండా ఆ దేశం నాటోలో ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్కు భద్రతా హామీలు అవసరమని.. లేకపోతే చరిత్ర పునరావృతమవుతుందని స్టోల్టెన్బర్గ్ హెచ్చరించారు.