సిరాన్యూస్,ఆదిలాబాద్
కార్మిక శాఖకు మంత్రిని కేటాయించాలి: సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు
* కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
* కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలతో సమీక్ష సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో కార్మిక శాఖకు మంత్రిని కేటాయించాలని, కార్మికుల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా పేరుకుపోయిన కార్మిక ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కీం వర్కర్లు కార్మికులు ఉద్యోగులు చేపట్టిన సమ్మె సందర్బంగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు గత ఐదు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు గత ఐదు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని అన్నారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు గత 15 సంవత్సరాలుగా వేతన సవరణలు లేక వేతనాలు పెరుగక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆరు నెలలు గడుస్తున్న కార్మిక శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం కార్మికుల ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుందని అన్నారు. వెంటనే కార్మిక శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కార్మిక సంఘాలతో రాష్ట్ర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆశన్న అన్నమొల్ల కిరణ్ కోశాధికారి కె. సునీత ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న అగ్గిమల్ల స్వామి ఎం. గంగన్న సహాయ కార్యదర్శులు పి. జితేందర్, డి. వెంకటమ్మ, డి. సునీత తదితరులు పాల్గొన్నారు.