సిరాన్యూస్, ఉట్నూర్ :
ఫోన్ ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన
ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను నేరుగా ప్రజల నుండే తెలుసుకొని, ఆ సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వినూత్న రీతిలో “ఫోన్ ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే” అనే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఖానాపూర్, కడెం, జన్నారం,పెంబి, దస్తురాబాద్, సిరికొండ మండలాల వివిధ గ్రామాలకు చెందిన గ్రామస్తులు, ఉద్యోగులు వందలాది మంది ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో మాట్లాడి వారు ఎదురుకుంటున్న నీటి, రోడ్డు, డ్రైనేజీ, కరెంటు, మిషన్ భగీరథ, జీవో నంబర్ 3,ఫారెస్ట్,జీవో నంబర్ 317, భూమీకి సంబందించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సిఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేదింటి బిడ్డయిన తనకు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటాననీ అయన తెలిపారు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.