సిరాన్యూస్, ఇంద్రవెల్లి :
సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
విజయ డెయిరీ పాల కేంద్రం సందర్శన
* పొద్దు పొడుపు బొజ్జన్న అడుగు కార్యక్రమం
కాలనీలలో నెలకొన్న నీటి, కరెంటు,రోడ్డు, మురికి కాలువల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గోండుగూడ, మిలిందనగర్, గజానంద్ నగర్, బుద్ధనగర్, బజార్ గల్లి, ప్రబుద్ధనగర్, రాంనగర్, భీంనగర్,వడ్డెర గల్లి, పూలాజీ బాబా నగర్, కొబ్బాయిగూడ తదితర కాలనీలలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పొద్దు పొడుపు బొజ్జన్న అడుగు(మార్నింగ్ వాక్) కార్యక్రమం నిర్వహించారు. వాడల్లో నెలకొన్న సమస్యలను స్థానికులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పొద్దు పొడుపు బొజ్జన్న అడుగు(మార్నింగ్ వాక్) కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.ఈ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పేదలను గుర్తించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన 4 నెలల్లోనే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల భీమా లాంటి ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో మహిళలకు 2500 వేలు, వృద్దులకు, వితంతువులకు, అంగవైకల్యం చెందిన వారికి 4 వేల చొప్పున పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందన్నారు.
రైతులకు లాభం చేకూర్చాలి…
మండలంలోని వెటర్నరీ పశు వైద్య శాలలో నడుస్తున్న విజయ డెయిరీ పాల కేంద్రంను సందర్శించి రైతులు వద్ద కొనుగులు చేస్తున్న పాల క్రయ విక్రయాల వివరాలను డైరీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు ఉన్నారు.