Venkata Sai: ఇద్దరికి చూపునిచ్చిన యువ ఇంజనీర్ వెంకటసాయి

సిరా న్యూస్, ఓదెల: 

ఇద్దరికి చూపునిచ్చిన యువ ఇంజనీర్ వెంకటసాయి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన యువ ఇంజనీర్ వెంకటసాయి (28) తన రెండు కళ్ళు దానం చేసి ఇద్దరికీ చూపునిచ్చాడు. శనివారం ఆయన మృతి చెందగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి నేత కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులోనే వెంకట సాయి మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను చనిపోయి కూడా బ్రతికి ఉండాలంటే నేత్రాలను చూపు లేని మరో ఇద్దరికి దానం చేయాలని కుటుంబీకులను కోరారు. బాధ తప్త హృదయంతో కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించగా, ఎల్ వి ప్రసాద్ కరీంనగర్ ఐ బ్యాంక్  టెక్నీషియన్ గాజుల  సతీష్ నేత్రాలను సేకరించి, హైదరాబాద్ ఐ బ్యాంక్ కు పంపించారు. దీంతో అతని కళ్ళతో చూపులేని మరో ఇద్దరు అంధులకు వైద్యులు చూపును ప్రసాదించారు. కుటుంబం మొత్తం దుఃఖంలో ఉండి కూడా మరో ఇద్దరు అంధులకు చూపునివ్వడానికి ముందుకు వచ్చిన వెంకట సాయి తల్లితండ్రులు సరిత, రమేష్, పెద్దనాన్న కుమార స్వామి, తమ్ముడు అజయ్, అక్క బావ మౌనిక, సతీష్ లను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, సంస్థ ప్రతినిధులు రమేష్,రాజమౌళి, పృత్విరాజ్, వాసు, సారంగం, డాక్టర్ వెంకటేశ్వర్లు ,డాక్టర్ వేణు, సంతోష్, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు తానిపర్తి విజయలక్ష్మి, సభ్యులు బంక కళావతి, మనీషా అగర్వాల్, ప్రతినిధి బెణిగోపాల్ త్రివేది, తదితరులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *