సిరా న్యూస్, నిర్మల్:
+ వేణునగర్ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు..
నిర్మల్ జిల్లా పెంబీ మండలంలోని వేణునగర్ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకులు ఆత్రం హన్మండ్లు, ఆత్రం పరమేష్, పి బాపూరావ్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మండల స్థాయి నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. నవంబర్ 29న అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు, మరికొంత మంది కార్యకర్తలతో కలిసి వేణునగర్లో రాత్రి డబ్బులు పంచుతుండగా అడ్డుకున్న తమను కులం పేరుతో దూషించాడని వారు పేర్కొన్నారు. ఈ మేరకు సదరు నాయకునిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పెంబీ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు విలేకర్లకు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు తమ గ్రామంలో డబ్బులు పంచుతున్నట్లు తమ వద్ద వీడియోలు ఉన్నాయని, వెంటనే ఆ నాయకునిపై కేసులు నమోదు చేసి, చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన కు సంబంధించి పలు విడియోలను యువకులు సోషల్ మీడియా లో వైరల్ చేయడంతో, పెంబీ మండలానికి చెందిన అధికార పక్షం నాయకులు తమ పరువు ‘గంగా’ పాలైందని వాపోతున్నారు.