సిరా న్యూస్;
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా
45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం
భూ కబ్జాలు, రీ సర్వేతో వచ్చిన కష్టాలూ చెప్పుకోవచ్చు
ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ
ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ
ఎవరెవరు పాల్గొంటారు
గ్రామ సదస్సులో…
1.తహసీల్దార్, 2.రెవెన్యూ ఇన్స్పెక్టర్, 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్, 5. దేవదాయ, వక్ఫ్ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్శాఖ అధికారి, 7.అటవీ శాఖ అధికారి పాల్గొంటారు.
సున్నితమైన భూసమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందున కార్యక్రమం పూర్తయ్యేవరకు పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తారు.జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. ‘ప్రజల వద్దకే పాలన’ తరహాలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ అధికారులు భూ సమస్యలను తెలుసుకుంటారు. ఆగస్టు 15వ తేదీ నుంచి 45 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరో 45 రోజుల్లో సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తారు. గత ఐదేళ్లలో భారీగా భూ అక్రమాలు జరిగాయి. పేదలు, బడుగువర్గాలు, అణగారిన వర్గాల భూములను వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకొని రికార్డులను తారుమారుచేసి వారికి నరకం చూపించారు. ఇదేమిటని అడిగితే సమాధానం చెప్పే దిక్కులేదు. ఉద్దేశపూర్వకంగా వెబ్ల్యాండ్లో చిన్న, చిన్న మార్పులు చేసి ప్రజలను హింసించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తోన్న వినతిపత్రాల్లో సగానికిపైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి. జగన్, ఆయన అనుయాయులు చేసిన పాపాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో అరాచకం ప్రబలుతుందని, పేదల నోటికాడి ముద్దను తీసేసినట్లవుతుందని భావించిన ప్రభుత్వం తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. 45 రోజులపాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం…ఇదే ప్రస్తుత టార్గెట్. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు అంటే 45 రోజుల పాటు సదస్సులు నిర్వహించనున్నారు.
జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను 13నాటికే ఖరారు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎ్సను ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జేసీ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, సభ్యులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కలెక్టర్లు తగిన చొరవ తీసుకోవాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు.