సిరా న్యూస్,విశాఖపట్టణం;
విశాఖపట్నం అనగానే గుర్తుకొచ్చేవాటిలో ఒకటి ప్రకృతి రమణీయమైన సముద్రం కాగా మరొకటి ఆంధ్రులు ఉద్యమించి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో 1966లో చేపట్టిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ప్లాంట్ను ఇప్పుడు మళ్లీ అదే నినాదంతో పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంతో రాష్ట్రంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నా జగన్ సర్కారు మాత్రం ఏమి పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.విశాఖలో ఉక్కు కర్మాగారం సాధన ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. పదహారు వేల మందికిపైగా నిర్వాసితులు 22 వేల ఎకరాలు తమ భూములను స్వలాభం చూసుకోకుండా కారుచౌకగా ప్రభుత్వానికి అప్పగించారు. అనేక త్యాగాల ఫలితంగా 1990లో ప్రారంభమైన విశాఖ ఉక్కు పరిశ్రమ 2021 నాటికి వార్షిక టర్నోవర్ రూ. 20 వేల కోట్లకు చేరి రూ. 945 కోట్లు నికర లాభం సాధించిందంటే, ఈ ఘనత విశాఖ స్టీల్ప్లాంట్లో శ్రమిస్తున్న కార్మికులకు, అధికారులకే దక్కుతుంది.2021 నుండి విశాఖ స్టీల్ప్లాంట్పై ప్రభుత్వం వివక్ష ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో రూ. 910 కోట్లు కేటాయించి అంచనాల సవరణతో రూ. 603 కోట్లకు తగ్గించారు. 2023-24 బడ్జెట్లో కేటాయింపులను రూ. 683 కోట్లకు పరిమితం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధుల కేటాయింపులు తగ్గుతున్నా రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్రాన్ని ప్రశ్నించ లేదు.దేశంలో కార్పొరేట్ వ్యవస్థ ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత కాలంలో పారిశ్రామికవేత్తల కళ్లు పచ్చగా సాగుతున్న విశాఖ ఉక్కుపై పడ్డాయి. రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ పెద్దలు కూడా పరోక్షంగా దీనికి సహకరించడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ సబ్కమిటి 27.01.2021న ప్రకటించగా దీనికి వ్యతిరేకంగా స్టీల్ప్లాంట్ కార్మికులు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖలకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలిచ్చారు.
విశాఖ స్టీలు ప్లాంటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవేది?
విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత రెండు సంవత్సరాలుగా కార్మికసంఘాలు, వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలంగా మారింది.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గతంలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఉద్యమానికి మద్దతుగా ఉంటామని చెప్పిన అధికార వైఎస్ఆర్సీపీ తన బాధ్యతను విస్మరించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రయవేటీకరణను అడ్డుకునే అవకాశమున్నా వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. న్యాయమైన ఈ అంశంపై అన్ని రాజకీయపార్టీలు మద్దతును జాతీయస్థాయిలో కూడగట్టడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైంది.కర్మాగారం కింద ఉన్న 22 వేల ఎకరాల భూములపై కన్నువేసిన కార్పొరేట్ సంస్థలకు కర్మాగారాన్ని నడిపే ఆలోచన ఏ కోశాన లేదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నట్లు, కోట్ల రూపాయల నిధులు చేతులు మారే అవకాశం ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలలో ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు లేకపోవడం వల్ల సంవత్సరానికి 2 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. 2021-22 వార్షిక టర్నోవర్ రూ. 20 వేల కోట్లు వరకు ఉన్నా కర్మాగారం నష్టాల్లో ఉందనే నెపంతో ప్రయివేటీకరణకు తలుపులు తెరిచారు. ఇందులో భాగంగా ఒడిస్సా మినరల్ డెవలప్మెంట్ కంపెనీకి విశాఖ ప్లాంట్ గనుల కోసం 2400 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించినా ప్రయివేటీకరణ కుట్రలో భాగంగా మైనింగ్ తవ్వకాలకి అనుమతులు ఇవ్వలేదు.2024లో రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను ఒక సదావకాశంగా మల్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నించకపోతే చివరి అస్త్రం జారవిడ్చుకున్నట్టు అవుతుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణతో తమ బతుకులు రోడ్డున పడుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు మధనపడుతున్నా ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు రాజధాని తరలించడంపై దృష్టి పెట్టారు. విశాఖను రాజధాని చేద్దామనుకున్నా ప్రధాన ఆదాయ వనరులైన విశాఖ స్టీల్ ప్లాంట్ లేకుండా ఆర్థికంగా ఎలా నెట్టుకొస్తామనే ఆలోచన కూడా జగన్ ప్రభుత్వం చేయడం లేదు.విశాఖ నగరం అభివృద్ధిలో కీలకమైనవి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు. అందులో సింహభాగం విశాఖ స్టీల్ ప్లాంట్దే. దాదాపు 30 వేల మంది ప్రత్యక్షంగా, మరో లక్ష మంది పరోక్షంగా విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆధారపడి జీవిస్తున్నారు.