సిరా న్యూస్,మెదక్;
సాగు నీరందక నెర్రెలు వారుతున్నాయి పొలాలు. బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వేసవి ప్రారంభం కాక ముందే ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అన్ని అండుగంటి పోతున్నాయి. దీంతో వరి పంట వేసిన రైతులు సాగు నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇంకా వేసవి మొదలు కాక ముందే ఎండలు క్రమ క్రమంగా ముదురుతున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని మెట్ట ప్రాంతలైన హుస్నాబాద్ డివిజన్లోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలతో పాటు దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని భూగర్భ జలాలు చాలా అడుగంటుతున్నాయి. ఎక్కువ శాతం బోరుబావుల కింద పంటలను సాగు చేయగా, సరిగ్గా నీరందించలేకపోవడంతో వరి చేలు ఎండుముఖం పడుతున్నాయి. ఆరుగాలం శ్రమంతా వృథా అవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంట పండించడం కష్టమే అని అంటున్నారు రైతన్నలు. వర్షాకాలం సీజన్లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లాయి. అతివృష్టితో కొన్ని ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి చేతికి రాకుండా నేలపాలైంది. అయితే ఆ వర్షాలకు వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోవడంతో రైతులు యాసంగి పంటలపై ఆశలు పెంచుకున్నారు. వరి సాగు వైపు మొగ్గు చూపారు.అయితే ఫిబ్రవరి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటి పోతున్నాయి. బోర్లు నీరు ఇంకిపోతున్నయి. దీంతో వరికి సరిపడా నీరందించలేక రైతులు అల్లాడుతున్నారు. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు వ్యవసాయ బావుల్లో పూడికతీతను చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక నెర్రెలువారిన చేనులో పశువులను మేపుతున్నారు కొంతమంది రైతులు. నీరు లేక చాలా చోట్ల పొట్ట దశలో మాడిపోతు న్నాయి వరి పంటలు. హుస్నాబాద్ డివిజన్లో సాగుకు యోగ్యంగా లక్షా 40 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో దాదాపు లక్ష ఎకరాల్లో పంటలను సాగుచేశారు.యాసంగిలో మాత్రం 69 వేల ఎకరాల్లోనే సాగు చేశారు. ఇందులో వ్యవసాయ బావులు, బోరుబావుల కింద దాదాపు 54 వేల ఎకరాల్లో వరి పంటను సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. మెట్ట ప్రాంతంలో సాగుకు నీరందకపోవడంతో పొట్టదశకు చేరిన వరి ఎండలకు మాడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బావుల్లో ఉన్న నీటిని చూసి ఉన్న ఎకర ముప్పది గుంటలలో వరిని సాగు చేసాము అని.. నాట్లు వేసి 40 రోజులు కాలేదు అని, అప్పుడే బావుల్లో నీళ్లు అడుగంటి పోయాయి. వేసిన పంటను దక్కించుకోవడం కోసం బావిలో పూడిక తీపించి స్పింక్లర్ పైపులు తెచ్చి మడిమడికి వేసి నీటిని పారిస్తున్నారు. ఫిబ్రవరిలోనే నీటి గండం మొదలైందని. ఇంకా కనీసం 30 రోజులైనా గడిస్తే పంట చేతికి వస్తుందన్న ఆశ తప్ప వేరే ఆధారం లేదని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. సాగునీటి కోసం వ్యవసాయ భూమిలో నాలుగు బోర్లు వేస్తే చుక్కనీరు కూడ పడడంలేదు. వేసిన రెండెకరాలు పూర్తిగా ఎండిపోతున్నాయి అని సాగునీటి కోసం ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.