అక్రమ కేసులతో వైసిపి నాయకులు వేధిస్తున్నారు, న్యాయం చేయండి
31వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ
ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి భరోసా
సిరా న్యూస్,మంగళగిరి;
అమరావతిః ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. 31వ రోజు “ప్రజాదర్బార్” లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి.. వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు
– ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇళ్లు పూర్తిగా నీటమునిగాయని, ఇంట్లోని వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమయ్యాయని ఉండవల్లికి చెందిన సీహెచ్ శ్రీనివాస్, ఏ.సుబ్రహ్మణ్యం, ఎన్.వెంకట్రావు, సైదులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం అందించడంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతుల కోసం విజయవాడలో మాదిరిగా గుంటూరు జిల్లాలోనూ ఉచిత సర్వీస్ సెంటర్ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.