సిరా న్యూస్,కాకినాడ;
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. ఆయన వైసీపీలో చేరిక లాంఛనమేనని అంతా భావించారు. ఇక ప్రకటనే తరువాయి అన్న రేంజ్ లో ప్రచారం జరిగింది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆయన వైసీపీలో చేరిక ఆగిపోయింది. జనసేనలో జాయిన్ అవుతారని ప్రచారం ప్రారంభమైంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. అయితే ముద్రగడలో సడెన్ చేంజ్ పై రకరకాలైన ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.ముద్రగడ రాజకీయ ప్రయాణం వైసీపీతోనని అంతా భావించారు. ముద్రగడకు రాజ్యసభ పదవితో పాటు ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు వైసీపీ నుంచి లభిస్తుందని టాక్ నడిచింది. కానీ అలా జరగలేదు. కాకినాడ ఎంపీ సీటు కానీ.. పిఠాపురం, ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాలు ముద్రగడకు సంబంధించి ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ వైసీపీ హై కమాండ్ హ్యాండ్ ఇచ్చింది. ముద్రగడకు కేవలం రాజ్యసభ పదవి మాత్రమే ఇవ్వగలమని తేల్చి చెప్పింది. అసెంబ్లీ సీట్లు ఇచ్చిన ఓటమి తప్పదని అంచనా వేసింది. అదే విషయాన్ని ముద్రగడకు చెప్పింది. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వారా పావులు కదిపారు. దీంతో ముద్రగడ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.1999లో టిడిపి తరఫున ముద్రగడ కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో రెండోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. చంద్రబాబు నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్ కు పరోక్షంగా సహకారం అందించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ కు అనుకూలంగా మాట్లాడారు. నిత్యం చంద్రబాబు పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇబ్బందులు తెచ్చి పెట్టేలా వ్యవహరించారు.కానీ అటువంటి ముద్రగడ సీట్ల విషయంలో వైసీపీతో తేడా కొట్టడంతో జనసేనకు జై కొడుతున్నారు. జనసేన టీడీపీతో పొత్తుతో ఉన్నా పట్టించుకోలేదు. ఆ కూటమిలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల్లో పవన్ తో భేటీ కానున్నారు. చర్చలు కొలిక్కి వచ్చాక అధికారిక ప్రకటన చేయనున్నారు.